Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగులో మరిన్ని సంస్కరణలు అవసరం
- 5 ట్రిలియన్ డాలర్ల 'ఆర్థిక శక్తి'గా భారత్
- ఎన్నికలయ్యాయి.. ఇక వృద్ధిపై దృష్టి పెడదాం:
- నిటి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ
న్యూఢిల్లీ: దేశంలో కార్పొరేట్ పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిటి ఆయోగ్ ఐదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూ కాశ్మీర్ గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్య సాధనకు రాష్ట్రాల భాగస్వామ్యమే కీలకమని వివరించారు. ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతుల విభాగమే కీలకమని, రాష్ట్రాలు ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని కోరారు. జల వనరుల వినియోగంలో కొత్తగా ఏర్పాటు చేసిన జల్శక్తి మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని తీసుకొస్తోందన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, జలవనరుల వినియోగంలో రాష్ట్రాలు వివిధ రకాలుగా చొరవ తీసుకోవాలని సూచించారు.
ఎన్నికలు ముగిశాయి.. ఇక వృద్ధిపై దృష్టి
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన భారత్లో ఎన్నికల తంతు ముగిసిందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి దిశగా పని చేయాలని ప్రధాని సూచించారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చారు. ప్రతి భారతీయుడికి సాధికారత, గౌరవ ప్రదమైన జీవన పరిస్థితులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, చేపల పెంపకం, పశు పెంపకం, ఉద్యాన ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల పెంచటంపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ నిధి ప్రయోజనాలు, ఇతర రైతు ప్రాధాన్యత కల్గిన పథకాలు లబ్దిదారులకు సమయానుసారంగా అందాలని, వ్యవసాయంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అన్నారు. కార్పొరేట్ పెట్టుబడులను పెంచడం, బలమైన లాజిస్టిక్స్, తగినంత మార్కెట్ సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంకా స్వీకరించని రాష్ట్రాలు ముందుకొచ్చి ఆ ఫలాలు ప్రజలకు అందించాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఆహార ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని, వెనుకబడిన జిల్లాలకి సుపరిపాలన అందేలా దృష్టి పెట్టాలని, పాలనలో మెరుగుదల అనేక వెనుకబడిన జిల్లాల గొప్ప పురోగతికి దారితీసిందని అన్నారు. వెనుకబడిన జిల్లాల్లో సృజనాత్మక ఆలోచనలతో కొన్ని వినూత్న సేవా పంపిణీ ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని చెప్పారు.
కేసీఆర్ గైర్హాజరు..
''సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్'' విజయవంతం కావడంలో నీతి ఆయోగ్దే కీలక పాత్ర అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, అమరీందర్ సింగ్, మమత బెనర్జీలు గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, రామ్ విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్ తదితరులు పాల్గొన్నారు.