Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో మదుపరుల్లో ఆందోళన
- మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు వెనుకడుగు
- చేతులు కాలాక.. సర్కారు దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. కీలకమైన ఎన్బీఎఫ్సీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుండటంతో ఈ రంగంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) సంస్థ ఉదంతం వెలుగుచూడటంతో మదుపరుల్లో ఆందోళన మొదలైంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగేస్తున్నారు. దీంతో ఈ రంగం మరింత దిగజారే ప్రమాదమున్నది. కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బ్యాంకుల్లో మోసాలు పెరగడం.. అటు తర్వాత ఆర్థిక వృద్ధి మందగించడంతో బ్యాంకుల్లో మూలధనాన్ని సమకూర్చే నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్బీఎఫ్సీ రంగంలోనూ ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తున్నది. ఐఎల్ఎఫ్ఎస్ ఉదంతంతో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఐఎల్ఎఫ్ఎస్ రూ.91,000 కోట్లమేర అప్పుల్లో కూరుకుపోయినట్టు గతేడాది వెల్లడి కావడంతో దిద్దుబాటు చర్యలకు కేంద్రం ముందుకొచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంలో చిక్కుకుంటే జరిగే నష్టం పట్ల కేంద్ర ప్రభుత్వ ఆందోళనకు కారణాలు తెలిస్తే, ఆర్థిక వ్యవస్థపై అది చూపే ప్రభావమేమిటన్నది అర్థమవుతుంది.
ఐఎల్ఎఫ్ఎస్ నుంచి పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్వాహకులు పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకున్నారు. అప్పులు పొందినవాటిలో రోడ్లు, సొరంగాల నిర్మాణం, నీటి శుద్ధి కర్మాగారాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులున్నాయి. భూసేకరణలో ఇబ్బందులు, తదితర కారణాలతో పలు ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో, బ్యాంకులకు సకాలంలో అప్పులు, వడ్డీలు చెల్లించడంలో, కాలవ్యవధి డిపాజిట్లను చెల్లించడంలో ఐఎల్ఎఫ్ఎస్ విఫలమైంది.
దివాలా స్థితికి చేరుకున్న ఐఎల్ఎఫ్ఎస్ను ఎలాగైనా గట్టెక్కించాలనుకున్న కేంద్రం గతేడాది అక్టోబర్ 1న ఆ కంపెనీకి ఆరుగురు కొత్త డైరెక్టర్లను నియమించింది. ప్రస్తుతం ఐఎల్ఎఫ్ఎస్కు ఉదరుకొటక్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. పాత బోర్టును పక్కన పెట్టింది. ఐఎల్ఎఫ్ఎస్ నిర్వాహకులు పలు అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐవో)ను దర్యాప్తునకు ఆదేశించింది. ఐఎల్ఎఫ్ఎస్ ఉదంతాన్ని 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యంనాటి లేమ్యాన్ సంక్షోభంతో కొందరు పోల్చారు. అమెరికా చరిత్రలోనే లేమ్యాన్ దివాలా ప్రక్రియకు అతిపెద్దదిగా పేరున్నది.
ఐఎల్ఎఫ్ఎస్లో ప్రధాన షేల్హౌల్డర్ సంస్థల వాటాలు(2018, మార్చి 31 నాటికి) ఇలా ఉన్నాయి: ఎల్ఐసీ 25.34 శాతం, ఓరిక్స్ కార్పొరేషన్ ఆఫ్ జపాన్ 23.54 శాతం, అబూదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 12.56 శాతం, హెచ్డీఎఫ్సీ 9.02 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.67 శాతం, ఎస్బీఐ 6.42 శాతం.
ఇటీవలే ఎస్ఎఫ్ఐవో తన 840 పేజీల ఛార్జిషీట్ను ముంబయిలోని ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. అందులో ఐఎల్ఎఫ్ఎస్కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎఫ్ఐఎన్) పలు నిబంధనలను ఉల్లంఘించి అప్పులు మంజూరు చేసినట్టు పేర్కొన్నది. దాదాపు 30 సంస్థలు, వ్యక్తులపై అభియోగాలు నమోదయ్యాయి. నిర్వాహకుల్లోని ఉన్నతస్థాయి వ్యక్తులు కోటరీగా ఏర్పడి అక్రమాలకు పాల్పడినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. నిందితుల్లో కొందరు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో, ఐఎఫ్ఐఎన్కు ఎన్బీఎఫ్సీ లైసెన్స్ను రద్దు చేసే యోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది. మొదట షోకాజ్ నోటీస్ జారీ చేసి వివరణ కోరిన తర్వాత ఆర్బీఐ దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు.