Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక లాభాలు ఆశ చూపారని ఆరోపణ
బెంగళూరు : అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి తమను కార్వి గ్రూపు ముఖ్య అధికారులు మోసం చేశారని పలువురు పెట్టుబడిదారులు వారిపై కేసు పెట్టారు. సోమవారం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కార్వీ ప్రయివేటు లిమిటెడ్ వెల్త్ సిఇఒ అబిజిత్ బావేతో పాటు కార్వీ స్టాక్ బ్రోకర్స్, కార్వీ రియాల్టీ ఇండియా, కార్వీ క్యాపిటల్ డైరక్టర్ల పేర్లు ఉన్నాయి. పెట్టుబడిదారులకు 18-20శాతం లాభాలొస్తాయని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు తొమ్మిదిమంది ఇన్వెస్టర్లు తాము రూ.3.81కోట్లను మోసపోయామని బసవనగుడి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్వి రిలేషన్షిప్ మేనేజర్లు తరుచూ ఫోన్లు చేసేవారని, కొన్ని సార్లు ఇళ్లకు కూడా వచ్చారని ఫిర్యాదు దారులు ఆరోపించారు.
తమలాగే మోసపోయిన వందలాదిమంది బెంగుళూరు, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో ఉన్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కార్వి ప్రతినిధుల మాటలు నమ్మి కెట్కి షా తలటి ఆమె భర్త మయాంక్ హర్షద్ తలటిలు 2015లో రూ.176 కోట్ల పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు ఆరోపించారు. పెట్టుబడులకు రక్షణ ఉంటుందని కార్వి ప్రయివేటు వెల్త్ మేనేజర్ శ్రీనివాస్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అడిగితే నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల రిటర్న్లు ఆలస్యం అవుతున్నాయని అబద్దాలు చెబుతున్నారని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇన్వెస్టర్ల ఫిర్యాదులను స్వీకరించామని, పరిశీలిస్తున్నామని అక్కడి పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. విచారణ ప్రారంభిచామన్నారు.