Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటుకు మెజారిటీ వాటా
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కేంద్రం
- బడ్జెట్లో ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ : ఇప్పటికే పలు బ్యాంకుల విలీనాలు, నోట్ల రద్దు, బ్యాంకు దివాలా చట్టం తదితర సంస్కరణలు చేపట్టి బ్యాంకింగ్ రంగాన్ని బలహీనపర్చిన మోడీ సర్కార్ మరో ఎత్తుగడ వేసింది. బలహీన బ్యాంకుల సాకుతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లోని మెజారిటీ వాటాలను విక్రయించడానికి బీజేపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత వాటాల విక్రయానికి సంబంధించి ఆయా బ్యాంకులను గుర్తించే ప్రక్రియ ప్రాథమిక దశలో ఉందని సమాచారం. దీనిపై ఇప్పుడే కసరత్తు ప్రారంభమైందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారు పేర్కొన్నారు. దీనికి ఆమోదం లభించే జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ వాటాల విక్రయానికి సంబంధించిన న్యాయపరమైన సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంది. దీనికోసం చట్టసవరణ చేసే అవకాశం ఉంది.
వాటాల విక్రయంలో వచ్చిన నిధులను గ్రామీణ పేదల గృహ నిర్మాణ కార్యక్రమానికి ఉపయోగించాలని భావిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మధ్య కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. సంక్షేమ పథకాలకు వ్యయం పెంచాలని, మందగించిన వృద్ధి రేటుకు పునర్జీవం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా నిధులు రాబట్టుకోవాలని భావిస్తోందని..అందులో భాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మెజారిటీ వాటాను విక్రయించాలని యోచిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డీఎస్ మాలిక స్పందించడానికి నిరాకరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సులభంగా వాటాలను విక్రయించడానికి ఇప్పటికే పలు బ్యాంకులను మోడీ సర్కార్ విలీనం చేసింది. ఎక్కువ బ్యాంకుల్లో పలు సార్లు వాటాలను విక్రయించడం క్లిష్టమైన వ్యవహారం కావడంతో.. వాటిని ముందుగా ఏకీకరణ చేసి వాటాలను ఉపసంహరించుకోవచ్చనేది ప్రభుత్వ ఎత్తుగడగా ఉందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
పెరుగుతున్న ఎన్పీఏల రిస్క్
భారత బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీల సంక్షోభం పెరుగుతున్నదని బ్లూమ్బర్గ్ ఓ కథనంలో పేర్కొంది. గతేడాది చోటు చేసుకున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ డిఫాల్ట్ ఈ రంగంలో బలహీనతలను మరింత పెంచింది. బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్బీఎఫ్సీ)ల సమస్య మరో కొత్త సమస్యను సృష్టించింది. ఈ మధ్య కాలంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్ప్ (డీహెచ్ఎఫ్ఎల్), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కాపిటల్ కొత్త సమస్యల్లో చిక్కుకున్నాయి. ఎన్బీఎఫ్సీల కొన్ని డిఫాల్ట్లు, అదనంగా మొండి బాకీలు చోటు చేసుకోవడం బ్యాంకింగ్ రంగం, ఆయా స్టాక్స్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని మక్కరీ కాపిటల్ సెక్యూరిటీస్ అసోసియేట్ డైరెక్టర్ సురేష్ గణపతి పేర్కొన్నారు. పలు బ్యాంకులు కొన్ని బలహీన ఎన్బీఎఫ్సీలకు ఎక్కువగా నిధులు సమకూర్చాయన్నారు. యస్ బ్యాంకు రుణాల జారీ విధానంలో అనేక ఆందోళనలు, అనుమానాలు చోటు చేసుకోవడంతో గడిచిన ఏడాదిలో ఈ బ్యాంకు షేర్ విలువ దాదాపుగా 65 శాతం పతనమైంది. యస్ బ్యాంకు, ఇండుస్ఇండ్ బ్యాంకులు అధిక రుణ వ్యయభారంలో ఉన్నాయని గత జూన్లో యుబిఎస్ గ్రూపు ఏజీ ఒక రిపోర్టులో పేర్కొన్నాయి. బ్యాంకుల వద్ద ఎన్బీఎఫ్సీలు తీసుకున్న అప్పులు చెల్లించడంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటునప్పటికీ ఆయా విత్త సంస్థలు పూర్తిగా ఈ వివరాలను వెల్లడించకోవడం గమనార్హం.