Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు మేలు కలిగేలా సర్కారు యోచన
న్యూఢిల్లీ: వేగంగా విస్తరిస్తున్న భారత రిటైల్ ఇంధన రంగంలోకి మల్టీ బ్రాండ్ దిగ్గజాలు కాలుమోపి.. లాభాలను దండుకొనేందుకు వీలు కల్పించేలా సర్కారు కొత్త ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సూపర్ మార్కెట్లలో నిత్యావసర సరకుల మాదిరిగానే.. ఇక నుంచి పెట్రోల్, డీజిల్ కూడా అమ్మేలా నిబంధనలను సవరించాలని భావిస్తున్నట్ట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ క్యాబినెట్ ముందు ఒక ప్రతిపాదనను ఉంచి చర్చించే అవకాశం ఉందని సంబధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఒక కథనాన్ని వెల్లడించింది. క్యాబినెట్లో ఈ ప్రతిపాదనకు సమ్మతి లభిస్తే త్వరలోనే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాల్లో రిటైల్గా పెట్రోలు, డీజిల్ అందుబాటులోకి రానుంది. అధికారిక వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ ప్రతిపాదనపై పెట్రోలియం శాఖ ఒక ప్రతిపాదన తయారు చేసినట్టు సమాచారం. కఠిన నిబంధనలు లేకుండా ప్రైవేటు కంపెనీలు రిటైల్ ఇంధన రంగంలోకి సులభంగా ప్రవేశించడానికి తగిన వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మల్టీ బ్రాండ్ దిగ్గజాలైన రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలు భారత రిటైల్ ఇంధన రంగంలోకి సులభంగా కాలుమోపే అవకాశం కలుగనుంది. దీంతో ప్రభుత్వ రంగంలోని రిటైల్ చమురు సంస్థల లాభాలకు గండిపడి, దీర్ఘకాలంలో నిర్వీర్యమయ్యే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.