Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- '5 ట్రిలియన్ డాలర్ జీడీపీ' సాధిస్తే
ఎవరికి ఉపయోగం?
- ఆర్థిక, రాజకీయ విశ్లేషకుల ప్రశ్న
బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను '5 ట్రిలియన్ డాలర్ జీడీపీ'గా (సుమారుగా రూ.350 లక్షల కోట్లు) మారుస్తామని చెప్పారు. ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ '2.61 ట్రిలియన్ డాలర్ల (178 లక్షల కోట్లు రూపాయలు) జీడీపీ' మార్క్ను అందుకుంది. అయినంత మాత్రాన రైతులకు, యువతకు, మహిళలకు ఒరిగిందేమిటి?అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, పేదరికం..వీటిని ఎలా పరిష్కరిస్తున్నారో చెప్పకుండా... ఊహాజనితమైన లెక్కలతో సరిపుచ్చడమంటే మోసచేయడమే నన్నారు. కేంద్ర బడ్జెట్ తీరుతో ప్రజల ఆశలు వమ్ముయ్యాయి.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ, 2025నాటి ముచ్చట చెప్పింది. ఈదేశంలో 2018నాటికి వస్తు సేవలు, ఉత్పత్తి విలువ (ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ చెప్పింది) 2.61 ట్రిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే 178లక్షల కోట్లు. దీనిని 2025నాటికి రెట్టింపు (సుమారుగా రూ.350 లక్షల కోట్లు) చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదటి మాటల్లోనే చెప్పారు. బడ్జెట్ అంటేనే ఒక నిర్దిష్ట కాలపరిమితిలో జరిగే ప్రభుత్వ రాబడి, వ్యయం. అయితే తాజా బడ్జెట్లో ఏ ఏ రంగాలకు వ్యయం చేస్తున్నామో, పెంచుతున్నామో కేంద్రమంత్రి స్పష్టంగా తెలుపలేదు. కేటాయింపులు పెరిగితే ఎందుకు చెప్పుకోరు. కచ్చితంగా చెప్పుకునేవారని ఆర్థికవేత్తల మాట.
పేదలు, రైతులు, యువత, మహిళల కోసం ప్రభుత్వ వ్యయం పెరిగితే మోడీ సర్కార్ చెప్పుకోకుండా ఉంటుందా? అనే సందేహాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేశాయి. వ్యయం పెరగలేదు. కేటాయింపులు పెంచలేదు...కాబట్టే దానిని దాచే ప్రయత్నం చేశారని వారు విమర్శిస్తున్నారు. ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాన్ని (3.1శాతం) చేరుకోవటం కోసం మోడీ సర్కార్ సంక్షేమరంగంలో వ్యయాన్ని తగ్గించుకుందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది విమర్శకాదు...నిజమని..ఈసారి బడ్జెట్ గణాంకాల్ని పరిశీలించిన కొంతమంది ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేశారు. ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించబోతున్నట్టు స్పష్టంగా తేలిపోయింది. ఏదో చేస్తారని ఎదురుచూసిన రైతులు, నిరుద్యోగ యువత, మహిళలకు...'5 లక్షల కోట్ల డాలర్ల' కలను చూపి కేంద్రం చేతులు దులుపుకుంది.
లెక్కలు...లక్ష్యాలతో సమస్యలు పోతాయా?
దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా సుమారుగా 17శాతం ఉంది. కానీ దేశ జనాభాలో 50శాతానికిపైగా ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం. జీడీపీలో అత్యధిక వాటా పారిశ్రామికరంగానిదే. కానీ దేశ జనాభాలో 13శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులోనూ అసంఘటితరంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువ. ఈ వాస్తవాల్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కార్మికులు, యువత ఉపాధికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యయం రూ.9,29,000కోట్ల నుంచి రూ.8,76,000కు తగ్గినట్టు స్పష్టంగా కనపడుతోంది.
ముందు ముందు మరిన్ని అప్పులు
జీడీపీ(రూ.178 లక్షల కోట్లు)లో విద్యారంగానికి 0.4శాతం, వైద్యానికి 0.3శాతం, సబ్సిడీలకు 1.4శాతం, గ్రామీణ అభివృద్ధికి 0.7శాతం, సామాజిక సంక్షేమానికి 0.2శాతం, పట్టణాభివృద్ధికి 0.2శాతం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 0.7శాతం కేటాయించారు. ఇదంతా కలిపితే జీడీపీలో 4శాతం కూడా దాటటం లేదు. కానీ అప్పులపై వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించినది..(జీడీపీలో) 3.1శాతం. అభివృద్ధికోసం, సంక్షేమం కోసం కడుతున్నదానికంటే అప్పులపై వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇదీ ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి. ఈ అప్పుల్ని, వడ్డీ చెల్లింపులను చూపకుండా ద్రవ్యలోటును 3.1శాతానికి నియంత్రిస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ ఏడాది, రాబోయే కాలంలో మరిన్ని అప్పుల్ని సైతం కేంద్రం చేయబోతోంది.