Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వం నిధుల సమీకరణకు గాను విదేశీ మార్కెట్లలో బాండ్ల జారీకి సిద్ధం అవుతుండడాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆక్షేపించారు. దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితుల నేపథ్యంలో పన్ను ఆదాయం తగ్గిపోతుండడం, నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలూ ముసుకుపోతూ వస్తున్న నేపథ్యంలో.. మోడీ సర్కారు విదేశీ మార్కెట్లలో డాలర్ల రూపంలో బాండ్లను జారీకి రంగం సిద్ధం చేసుకుంటోందిజ ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.7.1 ట్రిలియన్ల మేర నిధులను మార్కెట్ల నుంచి సమీకరించాలని సర్కారు భావిస్తోంది. ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకొనేందుకు గాను దేశీయ మార్కెట్లలో పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో మోడీ సర్కారు విదేశాల వైపు చూస్తోంది. అయితే ఈ ఆలోచన సరైంది కాదని రాజన్ హెచ్చరించారు. విదేశీ మార్కెట్లలో బాండ్ల విక్రయం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం కావొచ్చని ఆయన అన్నారు. భారత్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు బాండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపే విదేశీ మదుపరులు.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే భారీగా విక్రయాలకు పాల్పడవచ్చని.. దీంతో తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చని ఆయన అన్నారు. డాలరు బాండ్ల విక్రయం వల్ల విదేశీ మారకం వాణిజ్యలో తీవ్ర ఒడిదుడుకులు నమోదు కావొచ్చని ఆయన విశ్లేషించారు. ఈ ప్రభావం జీ-సెక్ మార్కెట్పై ప్రతిబింబించే అవకాశం ఉందని అన్నారు. సర్కారు ఆలోచన వల్ల దేశీయ మార్కెట్లకు సానుకూలతేమీ లభించదని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత ప్రతికూలత నుంచి బయటపడేందుకు గాను సర్కారు ఎఫ్పీఐ నిబంధనలను సడలిస్తే సరిపోతుందని సూచించారు. విదేశీయులు విరివిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించేలా ఎఫ్పీఐ నిబంధనలను సరళతరం చేయడంతో పాటు ప్రస్తుతం రూపాయి బాండ్లలో విదేశీయులు పెట్టుబడి పెట్టేందుకు ఉన్న గరిష్ట పరిమితిని పెంచితే మేలని ఆయన అన్నారు. విదేశీ బాండ్ల వల్ల భారత్కు నిజమైన మేలు జరగదని.. పలు సమస్యలు ఎదరయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.