Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాజాగా అలహాబాద్ బ్యాంకులో రూ.1,774.82 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బీపీఎస్ఎల్) రూ.1,774.82 కోట్ల మేర సొమ్మును ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు శనివారం ప్రకటించింది. బీపీఎస్ఎల్ సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించి వారం కూడా గడవక ముందే.. తాజాగా అలహాబాద్ బ్యాంకులో మరో కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పరుస్తోంది.
రానున్న రోజుల్లో మరిన్ని కేసులు..
బీపీఎస్ఎల్ మోసానికి సంబంధించిన అలహాబాద్ బ్యాంక్ శనివారం భారతీయ రిజర్వు బ్యాంక్కు (ఆర్బీఐ) ఫిర్యాదు చేస్తూ ఒక నివేదికను సమర్పించింది. బీపీఎస్ఎల్ రుణాలకు సంబంధించి తాము జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తులో ఈ కుంభకోణాన్ని గుర్తించినట్టుగా మార్కెట్ నియంత్రణ సంస్థలకు అందించిన సమాచారంలో పేర్కొంది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా తాము గుర్తించినట్టు బ్యాంక్ తెలిపింది. అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్టుగా కూడా తమ ఆడిట్లో తేలిందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అందిన సమాచారం మేరకు స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్టుగా బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అక్రమంగా నిధులను మళ్లించారన్న ఆరోపణల ఆధారంగా కేసులు నమోదు చేసినట్టుగా బ్యాంక్ వెల్లడించింది. బీపీఎస్ఎల్ రుణాలకు సంబంధించి రూ.900.20 కోట్ల మేర నిధుల కేటాయింపులు జరిపినట్టుగా ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం దివాలా పరిష్కారంలో ఉన్న బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క బ్యాంక్ బీపీఎస్ఎల్ మోసాలను వెలుగులోకి తెస్తూ వాటిని ఆర్బీఐకి, విచారణ సంస్థలకు వెల్లడిస్తున్నాయి. దివాలా కేసు పరిష్కారంలో తమ రుణాలకు సంబంధించి తగిన కేటాయింపులు పొందాలనే లక్ష్యంతోనే బ్యాంకులు ఆలస్యంగానైనా బీపీఎస్ఎల్ మోసాలను వెలుగులోకి తెస్తున్నట్టుగా బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకులు తమకు జరిగిన మోసాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర ఖాతాల్లోకి 2348 కోట్లు మళ్లింపు..
బీపీఎస్ఎల్ సంస్థ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల నుంచి దాదాపు రూ.5000 కోట్ల వరకు రుణాలను సమీకరించినట్టుగా తెలుస్తోంది. బీపీఎస్ఎల్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (న్యూఢిల్లీ, ఛండీగడ్), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (కోల్కతా), ఐడీబీఐ (కోలకతా), యూకో బ్యాంక్ (ఐఎఫ్బీ-కోల్కతా) బ్యాంకుల నుంచి దాదాపు రూ.2,348 కోట్ల మేర నిధులను సమీకరించి 200 డొల్ల కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి బీపీఎస్ఎల్ సంస్థ చైర్మెన్ సంజరు సింఘాల్, వైస్ చైర్మెన్ అర్తీ సింఘాల్, కంపెనీ డైరెక్టర్లను నిందితులుగా పరిగణిస్తూ కేసు నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది. బీపీఎస్ఎల్ సంస్థ దాదాపు 33 బ్యాంకులు, విత్త సంస్థల నుంచి 2007-2014 మధ్య కాలంలో దాదాపు రూ. 47,204 కోట్ల మేర నిధులను అక్రమంగా రుణాల రూపంలో సమీకరించి దేశం దాటేయించినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థ రుణాలకు సంబంధించి లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న పీఎన్బీ తమ రుణాలను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ.. తొలిసారిగా బీపీఎస్ఎల్ మోసాలను వెలుగులోకి తెచ్చింది.