Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి!
- ఐటీ చట్టంలో మార్పులు చేయబోతున్న కేంద్రం
న్యూఢిల్లీ : పాన్కార్డు అవసరమైన చోట ఆధార్ సంఖ్యను ఉపయోగించు కోవచ్చని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తే భారీ జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఐటీ చట్టాన్ని సవరించబోతున్నారు. కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పాన్కార్డు తప్పనిసరి కాదనీ, దానిస్థానంలో ఆధార్ కార్డును కూడా ఉపయోగిం చుకోవచ్చనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్ సంఖ్యను సమర్పించే సమయంలో తప్పుడు అంకెలు నమోదు చేస్తే రూ.10వేల జరిమానా నిబంధనను వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. అందుకనుగుణంగా సంబంధిత చట్టాల్లో సవరణలు చేసి సెప్టెంబర్ 1 నుంచి జరిమానా నిబంధనను అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 272బి సవరించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జరిమానాకు సంబంధించి కొత్త నిబంధనలు ఇందులో పొందుపరుస్తారని తెలుస్తోంది. 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుంచి జనాభా డేటాను పొందిన తరువాత ఆదాయపు పన్ను విభాగం వ్యక్తికి ఆధార్ నెంబర్ ఆధారంగా పాన్ కేటాయించాలి. ఇప్పటికే తన ఆధార్ను తన పాన్తో అనుసంధానించిన వ్యక్తి కూడా తన ఎంపిక ప్రకారం పాన్కార్డుల స్థానంలో ఆధార్ను చట్ట ప్రకారం ఉపయోగించవచ్చని బడ్జెట్లో ప్రతిపాదించారు.
పాన్ నెంబర్ కోట్ చేయడం తప్పనిసరి అయిన అన్ని ప్రదేశాల్లో ఆధార్ అంగీకరించడానికి బ్యాంకులు, ఇతర సంస్థలు అందుకు తగినట్టుగా మార్పులు చేయబోతున్నాయి. ఈ అంశంపై రెవెన్యూ కార్యదర్శి అజరు భూషణ్ పాండే మాట్లాడుతూ.. 'ప్రస్తుతం మనదేశంలో 22 కోట్ల పాన్కార్డులు, ఆధార్తో అనుసంధానించి ఉన్నాయి. 120కోట్ల మందికి పైగా ప్రజలు మన దేశంలో ఆధార్కార్డులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆధార్ ఉంటే పాన్ తప్పనిసరి కాదు. ఇక నుంచి బ్యాంకుల్లో కూడా రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలకు ఆధార్ను ఉపయోగించుకోవచ్చు''అని అని పాండే తెలిపారు.