Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2025నాటికి పదిరెట్లు పెరగనున్న ఎలక్ట్రిక్ కార్లు
- 'చార్జింగ్ వ్యవస్థ'కు థర్మల్ పవర్ ప్లాంట్లే ఆధారం!
- బ్యాటరీ వ్యర్థాలతోనూ ముప్పే
- ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో సతమతమవుతున్న ఐరోపా దేశాలు
న్యూఢిల్లీ : దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పరిస్థితులు మరింత విషమంగా ఉంటున్నాయి. గతేడాదిలో ప్రపంచంలోని పది అత్యంత కలుషిత నగరాల్లో ఏడు మనదేశంలోనే ఉన్నాయని తేల్చిచెప్పిన ఓ నివేదికే ఇందుకు నిదర్శనం. కాలుష్యాన్ని కట్టడి చేయాలని పర్యావరణవేత్తలు, కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడితో ప్రభుత్వాలు అరకొర చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి పూర్తిస్థాయి ఫలితాలనివ్వడం లేదు. ఈ ఒత్తిడిని అదిగమించేందుకే మోడీ సర్కారు.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచిస్తున్నది. తయారీదారులపై ఒత్తిడి పెంచుతున్నది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)తో కాలుష్యాన్ని నిలువరించగలమా? పెద్దఎత్తున మార్కెట్లోకి వచ్చే లిథియమ్ అయాన్ బ్యాటరీలు, జీవితకాలం ముగిసిన లెడ్ యాసిడ్ ఘటాలను సరైన పద్ధతుల్లో హ్యాండిల్ చేయడానికి మనం సంసిద్ధులుగా ఉన్నామా? లాంటి ప్రశ్నలు ఈ నిర్ణయంతో ఉదయిస్తున్నాయి. అంతేకాదు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటయ్యే చార్జింగ్ వ్యవస్థ కూడా థర్మల్ పవర్ ప్లాంట్ వైపే చూసే అవకాశమున్నప్పుడు వీటితో కాలుష్య నియంత్రణ సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో లిథియమ్ అయాన్ బ్యాటరీలను ప్రామాణికంగా తీసుకున్నారు.
బొగ్గుపైనే ఆధారం..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయబోతున్నవారికి ఆదాయపన్ను మినహాయించబోతున్నట్టు తెలిపారు. వాటిపై జీఎస్టీని 12శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించనున్నట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకే మోడీ సర్కారు ఈ నిర్ణయాలు తీసుకుందనేది సుస్పష్టం. కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు దేశం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను నియంత్రిస్తాయా? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఇందుకోసం మన దేశంలో ఇంధన వినియోగంపై ఎలాంటి భావిప్రణాళికలు వేసిందో చూడాల్సిందే. దేశ అవసరాల కోసం బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రస్తుతం(47శాతం) కంటే 2030నాటికి అధికంగా(51శాతం) పెరుగుతుందని నిటి ఆయోగ్ అంచనా వేసింది. 2047నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి రెంట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఒక అంచనా. వాయుకాలుష్యానికి బొగ్గు వినియోగమూ ప్రధాన కారకంగా ఉంది. కాగా, భవిష్యత్లో పరిశ్రమలకు బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రధానపాత్ర పోషించనుంది. అలాగే, భారీ స్థాయిలో పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాలకు అదేస్థాయిలో చార్జింగ్ అందించే వ్యవస్థ కూడా థర్మల్ పవర్ ప్లాంట్లపైనే ఆధారపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అంటే, రోడ్డుపై నేరుగా కాలుష్యాన్ని విడుదల చేయని ఎలక్ట్రిక్ వాహనాలూ వాటి చార్జింగ్ కోసం పరోక్షంగా బొగ్గు(థర్మల్ పవర్ ప్లాంట్స్)పైనే ఆధారపడనున్నాయని విశ్లేషిస్తున్నారు. భారత ఇంధనవనరుగా బొగ్గు వాటా పెరుగుతున్న నేపథ్యంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్యాన్ని కట్టడి చేస్తాయనుకోవడం అసంబద్ధమని వివరిస్తున్నారు.
లిథియమ్ అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్పై చట్టాల్లేవ్ :
ఇండియాస్ బ్యాటరీస్(మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్) రూల్స్ 2001.. లెడ్ యాసిడ్ బ్యాటరీలకే పరిమితమయ్యాయి. లిథియమ్ అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్పై ప్రస్తుతం ఎలాంటి చట్టాల్లేవు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డూ ఇటీవలే ఈ విషయాన్ని ఓ రిపోర్టులో గుర్తించింది. వీటి రీసైక్లింగ్పై అసంఘటితరంగమూ ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే లిథియమ్ అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్తో విలువైన లోహాలు లభించవు. ఈవీ మార్కెట్ వృద్ధితోనే రీసైక్లింగ్ వ్యవస్థ మెరుగవుతుందని కొందరు ఆశావాద దృక్పథాన్ని వ్యక్తీకరిస్తున్నారు. కానీ, అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలూ.. లిథియమ్ అయాన్ బ్యాటరీ వ్యర్థాలతో సతమతమవుతున్నాయి. ఈ బ్యాటరీల నుంచి కేవలం ఐదుశాతం లిథియమ్ మాత్రమే ఆ దేశాల్లో రికవరీ అయినట్టు ఒక రిపోర్టులో తేలింది. మిగతాదంతా భూమిలో కప్పిపుచ్చడం లేదా కాల్చివేయడం జరుగుతున్నది. కాగా, నిటి ఆయోగ్ ఈ వ్యర్థాలను గుర్తించింది గానీ, రీసైక్లింగ్ కోసం బలమైన సూచనలేమీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీల నిర్వహణకు మన దేశం సిద్ధంగా ఉన్నదా? అనే సందేహాలు వస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించాలని ఈవీల వినియోగం పెంచాలనుకున్నా.. ఉద్దేశించిన లక్ష్యంపై మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈవీ రంగం పర్యావరణానికి ఏ మేరకు హితమోగానీ, ఇన్వెస్టర్లకు మాత్రం ఆశాజనంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
బ్యాటరీల రీసైక్లింగ్ సవాలే..
ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్తో బ్యాటరీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల బెడద ఉంటుంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 7.59 లక్షల ఈవీ యూనిట్ల అమ్మకం జరిగాయి. 2017 నుంచి 2025కి ఈ సంఖ్య పదిరెట్లు పెరగనున్నట్టు మార్కెట్ నిపుణుల అంచనా. అంటే తర్వాతి దశాబ్దంలో అదే స్థాయిలో వినియోగించిన బ్యాటరీలు పోగుపడతాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 34లక్షల బ్యాటరీలు వ్యర్థాలుగా మారనున్నట్టు సమాచారం. ప్రస్తుత వాహనాల్లో దశాబ్దాలుగా వినియోగిస్తున్న లెడ్ యాసిడ్ బ్యాటరీల రీసైక్లింగే మనకు సవాల్గా ఉన్నది. మనదేశంలో బ్యాటరీల రీసైక్లింగ్ కోసం పటిష్టమైన చట్టాలు లేవు.. స్పష్టమైన రీసైక్లింగ్ ప్రణాళికలూ లేవు. దీంతో లెడ్ యాసిడ్ బ్యాటరీల నుంచి కొందరు అత్యంత ప్రమాదకరమైన రీతిలో లోహాలను వెలికితీస్తున్నారు. ఒక కార్మికుడు ఏడాదిలో 60వేల మెట్రిక్ టన్నుల లెడ్ను ఈ బ్యాటరీల నుంచి సేకరిస్తాడు. ఢిల్లీలో ఇలాంటి 45 అక్రమ సైట్లను ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించి మూసివేసింది. వీరు అనుసరించిన విధానాల వల్ల ఎనిమిది లక్షల పెట్రోల్ కార్లు ఉద్గారించే వాయువులకు సమానమైన కాలుష్యం వెలువడినట్టు తేలడం గమనార్హం.