Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలులో సర్కారు తెచ్చిన పలు నియంత్రణ చర్యల కారణంగా.. దేశంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ అంశంపై పార్లమెంట్ సభ్యులు లోక్సభలో అడిగిన ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జీఎస్టీ వసూళ్లలో స్థిరమైన వృద్ధి నమోదవుతూ వస్తోందని మంత్రి పేర్కొన్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన జీఎస్టీ వసూళ్లు మొత్తం రూ.5.18 లక్షల కోట్లకు చేరినట్టుగా మంత్రి వివరించారు. ఇది అంతకు ముందు ఏడాది (2017-18లో) తొమ్మిది నెలల కాలంలో నమోదైన జీఎస్టీ వసూళ్లకంటే రూ.2.91 లక్షల కోట్లు అధికమని పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలలో విస్తృతంగా ఆటోమేషన్ చర్యలు చేపట్టేలా చూడడం, ఈ-వే బిల్లుల యాంత్రీకరణ, సమగ్రమైన వ్యాపార కార్యకాలపాల పరిశీలన, ఎన్స్ఫోర్స్మెంట్ ఆధారిత అసెస్మెంట్ తదితర చర్యలు వల్ల జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో అందుబాటులోకి తేనున్న ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ విధానం వల్ల జీఎస్టీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు. జీఎస్టీ వసూళ్లకు తోడుగా సర్కారు రాష్ట్రలకు రూ.81,177 కోట్ల మేర జీఎస్టీ పరిహారాన్ని చెల్లించిందని వివరించారు. అంతకు ముందు ఏడాది (జులై-మార్చి) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.48,178 కోట్ల మేర జీఎస్టీ పరిహారం చెల్లించిందని మంత్రి వివరించారు. దేశంలో అమలులో ఉన్న దాదాపు 17 వివిధ స్థానిక పరోక్ష పన్నుల మేళవింపుగా కేంద్ర ప్రభుత్వం 2017 జులై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.