Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి..
- బ్యాంకుల ఏకీకరణలో భాగంగానే 'ప్లాన్'!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
దేశంలో బ్యాంకుల విలీనం పేరుతో శాఖలను తగ్గించుకుంటూ వస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులున్నాయి.. ప్రభుత్వ రంగ బ్యాంకులూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక బ్యాంక్ కస్టమర్కు వేరొక బ్యాంక్ సేవలు అందించట్లేదు.. ఏ బ్యాంక్ కస్టమర్ ఆ బ్యాంక్లోనే ఎలాంటి సర్వీసులు పొందే సౌకర్యం ఇప్పటి వరకు అమలు ఉంది. అయితే రానున్న రోజుల్లో దీన్ని మార్చేయాలని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. భవిష్యత్తులో ఒక బ్యాంక్ కస్టమర్ మరొక బ్యాంకుకు వెళ్లి బ్యాంకింగ్ సేవలు పొందే వెసులుబాటు అందుబాటులోకి తేనుంది. ఈ దిశగా ఇప్పటికే మోడీ సర్కారు తాజా బడ్జెట్లో సంకేతాలు ఇచ్చింది.
తొలత పెద్ద బ్యాంకుల్లోనే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో బ్యాంకింగ్ వ్యవస్థను కస్టమర్లకు మరింత చేరువచేస్తామని ప్రకటించారు. ఆన్లైన్ పర్సనల్ లోన్స్, డోర్స్టెప్ బ్యాంకింగ్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్కు ఇతర గవర్నమెంట్ బ్యాంకుల్లో సేవలు వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇది అమలులోకి వస్తే.. ఒక బ్యాంక్ కస్టమర్ మరొక బ్యాంకుకు వెళ్లి బ్యాంకింగ్ సేవలు పొందే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఇప్పటికే బ్యాంకింగ్ వర్గాలతో ఆర్థిక శాఖ మంతనాలు జరిపినట్టుగా సమాచారం. అయితే తొలత ఈ కొత్త సౌకర్యాన్ని పెద్ద బ్యాంకుల్లోనే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ ఇతర బ్యాంకుల్లో సేవలు పొందే సదుపాయం కల్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు గాను అదనపు మౌలిక సౌకర్యాలతో పాటు భారీగా ఇన్షర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవలు అవసరం కావడంతో కొన్ని బ్యాంకులు సర్కారు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బ్యాంకుల ఏకకరణ కార్యక్రమంలో జోరు పెంచిన సర్కారు.. లాభదాయకం కాని బ్యాంకులను ఎత్తివేస్తోందన్న భావనను ప్రజల్లో తొలగించేందుకు ఈ ఆలోచన చేస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త విధానం అమలు వల్ల కొన్ని శాఖల్లో పని భారం భారీగా పెరిగిపోయే అవకాశం ఉండగా.. కొన్ని శాఖలకు ఖాతాదారుల తాకిడి మరింతగా పడిపోయే ప్రమాదమూ లేకపోలేదని కొందు ఉద్యోగులు చెబుతున్నారు. దీనికి తోడు ఇలా బ్యాంకుల మధ్య ఇంటర్ కనెక్టివిటీ మూలంగా రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని ఒక వర్గం వారు అభిప్రాయపడుతున్నారు.