Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతికూలత అర్థం కాక అయోమయం
- ప్రాదేశిక వాదంతోనే ప్రమాదముంది..
- చురుకైన ఉద్యోగులే సంస్థకు ఇం'ధనం'
- కేపీఎంజీ రిపోర్టులో సీఈవోల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో.. కంపెనీల సీఈవోల్లో ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. భారత్లోనైతే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రముఖ కన్సెల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో తేల్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నందు మెరుగైన అవకాశాల విషయంలో వివిధ కంపెనీలను నడిపించే బాస్ల(సీఈవోల) విశ్వాసం దారుణంగా దెబ్బతిందని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. ఈ విషయంలో గత ఏడాది 89 శాతంగా ఉన్న భారత సీఈవోల విశ్వాసం.. ఈ ఏడాది (2019కి) 53 శాతానికి పడిపోయిందని నివేదిక వివరించింది. భారత్లోని 125 మంది ప్రముఖ సీఈవోల అభిప్రాయాలను సేకరించి కేపీఎంజీ సంస్థ 'సీఈవో అవుట్లుక్' పేరుతో ఒక నివేదికను వెలువరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత ప్రాధాన్యత, అవకాశాలు, సవాళ్లు అనే విషయమై కేపీఎంజీ ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆర్థిక వ్యవస్థలో అనూహ్యంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అర్థం చేసుకొని వాటిని ఎదుర్కోవడం కష్టంగా మారుతోందని భారత్లోని అత్యధిక కంపెనీల సీఈవోలు అభిప్రాయపడినట్టుగా నివేదిక తెలిపింది. వ్యాపార విస్తృతికి అనుకూలమైన వాతావరణంలో మార్పులు (23 శాతం), ఆయా దేశాలు ఎత్తుకుంటున్న ప్రాదేశికవాదం (17 శాతం), అభివృద్ధి చెందుతున్న, వృద్ధికి అంతరాయం కలిగించే టెక్నాలజీ దాని నుంచి పొందివున్న ప్రమాదం (17 శాతం).. ఈ మూడు అంశాలు తమ సంస్థ వృద్ధికి ప్రధాన ప్రమాదాలుగా పొంచి ఉన్నాయని నివేదిక తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా ఇవే ప్రధాన ప్రమాదాలు ఎదురవుతున్నట్టుగా అత్యధిక మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. భారత్లో 73 శాతం మంది సీఈవోలు తమ వ్యాపారాల వృద్ధి సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అవరోధాలను ఎదుర్కొనే తీరుపైనే ఆధారపడి ఉంటుందని నమ్ముతున్నట్టుగా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం సీఈవోలు ఈ విధానాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నారని కేపీఎంజీ తెలిపింది.
నివేదికలోని ఇతర ప్రధానాంశాలు..
- ప్రతికూల పరిణామాలను నిలదొక్కుకొని ముందుకు సాగేందుకు గాను విలీనాలు, కొత్త కంపెనీల కొనుగోళ్లు తమ సంస్థలకు కలిసి వస్తాయని ఆయా సంస్థల సీఈవోలు భావిస్తున్నారు.
- కొత్త ఉత్పత్తులను కనుగొనే విషయంలో కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
- భారత్లోని 80% సీఈవోలు తమ సంస్థ ఉద్యోగులు ప్రతికూల పరిణామాలను గురించి చింతించకుండా నూతన ఆవిష్కరణలకు మొగ్గుచూపుతూ ముందుకు సాగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- ఇలాంటి సంస్కృతిని తమ సంస్థలో కల్పించాలని ఎక్కువ మంది సీఈవోలు అభిప్రాయపడుతున్నారు.
- తమ సంస్థలో ఇలాంటి ప్రోత్సాహకర సంస్కృతి ఉందని కేవలం 46% మంది సీఈవోలు మాత్రమే నమ్ముతున్నారు.
- భారత్లో మూడింట రెండొంతుల మంది సీఈవోలు ఉద్యోగుల చురుకుదనమే వ్యాపారానికి కొత్త కరెన్సీ (పెట్టుబడి) అని నమ్ముతున్నారు.
- నిరంతరం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారకపోతే తమ వ్యాపారం అసంబద్ధంగా తయారవుతుందని ఎక్కువ మంది సీఈవోలు విశ్వసిస్తున్నారు.
- చురుకైన సీఈవోనే విజయవంతమైన సీఈవో అన్న భావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని కేపీఎంజీ ఇండియా విభాగం చైర్మెన్ సీఈవో అరుణ్ కె కుమార్ అభిప్రాయపడ్డారు.