Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో విడతల వారిగా అందజేత
- జలాన్ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని బిమల్ జలాన్ కమిటీ సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం ఈ కమిటీ సమావేశమై నివేదికకు తుదిమెరుగులు దిద్దిందని.. త్వరలో దీన్ని ఆర్బీఐ, కేంద్రానికి అందించనుందని తెలుస్తోంది. ఆర్బీఐ వద్ద మిగులు నిధులను విడతల వారీగా మూడు నుంచి ఐదేండ్లలో ప్రభుత్వానికి బదలాయించాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న ఆస్తుల్లో 27శాతం మిగులుగా భావిస్తున్నారు. బిమల్ జలాన్ నేతత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ నిధుల బదిలీపై చర్చించగా.. ఇందులో పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఐదేండ్లలో ఎంత మొత్తం బదిలీ చేసేది తెలియరాలేదు. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి.
ఈ నిధులతో తమ విత్తలోటును భర్తీ చేసుకోవాలనేది కేంద్రం యోచన. మిగులు నిధుల బదిలీతో పాటు రూ. 90వేల కోట్లను డివిడెండ్ రూపంలో ఆర్బీఐ నుంచి ఆశిస్తున్నట్టు బడ్జెట్లో మోడీ సర్కార్ పేర్కొంది. గతేడాది ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి రూ.68వేల కోట్ల డివిడెండ్ రూపంలో అందింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్లో 14 శాతం రిజర్వుల రూపంలో
ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. అయితే ఆ దేశాల ఆర్ధిక పరిస్థితులు, భారత ఆర్ధిక పరిస్థితులు భిన్నమని పలువురు పేర్కొన్నట్టు సమాచారం. మిగులు నిధుల బదిలీపై ఇది వరకు ఆర్బీఐ గవర్నర్లు, ప్రభుత్వం మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో మోడీ సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కమిటీ వేసి తనకు అనుకూలంగా రిపోర్టు చేసుకొని.. ఆ నిధులను కాజేయాలని ఎత్తుగడలు వేసిందనే విమర్శలు ఉన్నాయి.