Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక కోల్ ఇండియా ముక్కలు
- కసరత్తులో మోడీ సర్కార్
- ఐదు సంస్థలుగా ఏర్పాటు యోచన
- డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలో భాగం
న్యూఢిల్లీ : విభజించి.. పాలించు పద్ధతిలో మోడీ సర్కార్ కోల్ ఇండియాను ముక్కలు చేసి కార్పొరేట్ శక్తులకు విక్రయించడానికి కసరత్తును ప్రారంభించింది. వచ్చే ఐదేండ్లలో దేశంలోని పలు పీఎస్యూలలో భారీగా వాటాల విక్రయానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ కోణంలోనే నవరత్న కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారైన కోల్ ఇండియాను ఏకంగా ముక్కలుగాచేసి.. వాటిల్లో వాటాలను ఉపసంహరించుకోవడానికి కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ చర్యతో పోటీతత్వం పెరుగుతుందనే సాకుతో ఇందులోని వాటాలను విక్రయించడం ద్వారా నిధులు రాబట్టుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ.. మోడీ సర్కార్ సీరియస్గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఇందుకోసం ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) విభాగం ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనను కోల్ ఇండియా, బొగ్గు మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేంద్రాలను, అన్వేషణ విభాగాన్ని స్ఠాక్ మార్కెట్లో ప్రత్యేక నమోదిత కంపెనీలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని.. ఈ అంశాలను వెల్లడించిన వారు తమ పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపలేదు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పీఎస్యూలలో రూ.1.05లక్షల కోట్ల మేర డిజిన్వెస్ట్మెంట్ చేయాలని మోడీ సర్కార్ బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. దీనిని వేగవంతం చేసేందుకు కోల్ ఇండియాను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కోల్ ఇండియాకు అనుబంధ సంస్థలుగా ఉన్నా మహానంది కోల్ ఫీల్డ్స్, సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్, నార్తర్న్ కోల్ఫీల్డ్స్, సెంట్రల్ కోల్ఫీల్డ్స్లతో సహా సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్ట్యూట్ (సీఎంపీడీఐ)ని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ప్రయివేటు సంస్థలకు వాటాలను కట్టబెట్టాలనేది ప్రధాన ఉద్దేశం.
నిటి ఆయోగ్ మూలం..
కోల్ ఇండియాలో ప్రస్తుతం కేంద్రానికి 71 శాతం వాటా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇందులో వాటాలను విక్రయించింది. ప్రపంచంలో బొగ్గు వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. మొత్తం దేశ ఉత్పత్తిలో కోల్ ఇండియా 83 శాతం వాటా కలిగి ఉంది. కోల్ ఇండియాను విభజించాలని 2017లో నిటి ఆయోగ్ సూచనలు చేసింది. ప్రస్తుతం మోడీ సర్కార్ దీన్ని ఆచరణలోకి తెస్తోంది. 2019 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కోల్ ఇండియా 607 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. బుధవారం బీఎస్ఇ సెన్సెక్స్లో కోల్ ఇండియా షేర్ అమ్మకాల ఒత్తిడితో 1.18 శాతం కోల్పోయి రూ.230.05 వద్ద ముగిసింది. 2018-19లో కోల్ ఇండియా 148 శాతం వృద్ధితో రూ.17,462 కోట్ల నికర లాభాలు సాధించింది. 2017-18లో రూ.7,038.44 కోట్ల లాభాలు నమోదు చేసింది.
ప్రతిపాదిత సంస్థలు
మహానంది కోల్ ఫీల్డ్స్
సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్
నార్తర్న్ కోల్ఫీల్డ్స్
సెంట్రల్ కోల్ఫీల్డ్స్
సీఎంపీడీ ఇన్స్ట్యూట్