Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.238 కోట్లు ముంచిన బీపీఎస్ఎల్
- 6 శాతానికి పైగా పడిపోయిన స్టాక్..
ముంబయి: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎన్ఎస్బీ) కుంభకోణం గురువారం ఆర్థికంలో ప్రకంపనలు సృష్టించింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్కు (బీపీఎస్ఎల్) సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులకు భారీ ఎత్తున కుచ్చు టోపీ పెట్టిన బీపీఎస్ఎల్ మరో ప్రభుత్వరంగ బ్యాంకైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకును కూడా ముంచేసిందన్న వార్తలతో బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ప్రభావితమయ్యాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ సంస్థ దాదాపు రూ.238 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిందని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయంలో వెలుగులోకి వచ్చినట్టుగా బ్యాంక్ తెలిపింది. సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రూ.238.30 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు, కంపెనీ, దాని డైరెక్టర్లు ఈ మేర ఫండ్స్ మళ్లించినట్టుగా బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఒక నివేదికను సమర్పించింది. రుణదాతల బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులను సేకరించేందుకు భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని, అకౌంట్ బుక్స్ను తారుమారు చేసిందని పంజాబ్ సింధ్ బ్యాంక్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేరు గురువారం బీఎస్ఈలో 6.20 శాతం మేర కుంగి రూ.24.20కు పడిపోయింది. ఎన్ఎస్ఈలో ఈ స్క్రిప్ పతనం 6.39 శాతం మేర పతనమైంది.