Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ కార్యాలయాలపై జీఎస్టీ పన్ను అధికారులు దాడులు జరిపినట్లు ప్రచురితమైన వార్తలపై ఆ సంస్థ శనివారం తీవ్రంగా స్పందించింది. ఈ దిశగా ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పన్ను చెల్లింపు చట్టాలలోని నియమ నిబంధనలకు లోబడే ఎంఈఐఎల్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. గడిచిన రెండేండ్ల కాలంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అత్యధికంగా జీఎస్టీని చెల్లించి సంస్థ తమదేనని ఎంఈఐఎల్ వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక తమ కంపెనీ ఇప్పటి వరకు దాదాపు మూడువేల కోట్ల మేర పన్ను చెల్లింపులు జరిపిందని సంస్థ వివరణనిచ్చింది. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఇన్ఫ్రా సంస్థల్లో మేఘా ఒకటిగా నిలుస్తుందని, పన్ను చట్టాలను ఎప్పుడూ తమ సంస్థ గౌరవిస్తుందని తెలిపింది. వాస్తవాలను నిర్థారణ చేసుకోకుండానే ఎంఈఐఎల్పై పన్ను అధికారుల దాడులు అనే వార్తను ప్రచురించడం వెనుక కొన్ని అదృశ్య శక్తుల దురద్దేశాలను బట్టబయలు అవుతున్నాయని సంస్థ తెలిపింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థపై ఐటీ, ఈడీ, జీఎస్టీ సంస్థల దాడులు జరిగాయని జరగబోతున్నాయంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో కక్షపూ రిత ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టుగా తమ దృష్టికి వస్తోందని.. ఇది సబబు కాదని సంస్థ తెలిపింది. మేఘాపై తప్పుడు కథనాలతో అనుచితమైన, అనవసర ప్రచారానికి పాల్పడిన ఆంగ్ల దినపత్రికపై చట్టపరమైన చర్యలకు తాము సిద్ధమవుతున్నట్టుగా సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఊహాజనిత వార్తలను నియంత్రించేందుకే తాము ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా ఎంఈఐఎల్ తెలిపింది.