Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రుణ సంక్షోభంతో నేలకొరిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు ఊరట కలిగించేలా శనివారం పలు అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు సాయం చేసేందుకు రుణదాతలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తంలో రుణం ఇవ్వనున్నారో మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కానీ 10మిలియన్ డాలర్లు రుణంగా ఇచ్చేందుకు రుణదాతలు సిద్ధంగా ఉన్నట్లుగా వివిధ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల సంస్థ పగ్గాలు అప్పులిచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లోకి వెళ్లాయి. ఉద్యోగులకు సైతం జీతాలిచ్చుకోలేని పరిస్థితికి చేరిన జెట్ ఎయిర్వేస్..ఈ రుణంతో కొంత మేర బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరం.
ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల..
జెట్ ఎయిర్వేస్ దివాలా కేసు పరిష్కారానికి నియమించిన రిజల్యూష్ ప్రొఫెషనల్ (ఆర్పీ) శనివారం కీలక ప్రకటనను విడుదల చేశారు. జెట్ ఎయిర్వేస్ను విక్రయించేందుకు గాను ఆర్పీ ఔత్సాహిక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను వెలువరించారు. ఈవోఐ దరఖాస్తుకు వచ్చే నెల 3వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించినట్టు ఆర్పీ ఆశీశ్ చ్వచారియా తెలిపారు. ఆగస్టు 6న ఈవోఐ దాఖలు చేసిన సంస్థ వివరాలతో ప్రాథమిక జాబితాను విడుదల చేయనున్నట్టుగా ఆర్పీ వివరించారు.