Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలు తీసుకున్న దేశాల్లో పెరిగిన ఆదాయ అసమానతలు
- స్వీయ అధ్యయనంపై దృష్టిసారించిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ : తాము చెప్పినట్టుగా ఆర్థిక విధానాలు అమలుజేసిన దేశాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరగటంపై అంతర్జాతీయ ద్య్రవనిధి సంస్థ ఆందోళన చెందుతోంది. తమ నుంచి అప్పులు తీసుకున్న దేశాల్లో ఆదాయ అసమానతలు తీవ్రంగా పెరిగాయనీ, సామాజికంగా అనేక దుష్ఫరిణామాలు ఏర్పడ్డాయనీ ఐఎంఎఫ్ స్వీయ అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి కొంతమంది ఆర్థిక విశ్లేషకులు రూపొందించిన పరిశోధనా పత్రం జాతీయ, అంతర్జాతీయ వార్తల్లో ప్రముఖంగా చోటుచేసుకుంది. ఇందులో వారి విశ్లేషణ ప్రకారం... ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రతీ దేశం ఐఎంఎఫ్ను సంప్రదిస్తోంది. రుణాలు పొందుతున్నాయి. అయితే ఈ రుణాలు స్వీకరించాలంటే ఆయా దేశాలకు ఐఎంఎఫ్ కొన్ని నిబంధనల్ని విధిస్తోంది. ఆర్థిక సంస్కరణలు చేపట్టాలనీ, ప్రయివేటీకరణకు బాటులు వేయాలని ఐఎంఎఫ్ ఒత్తిడిచేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పులు తీసుకోవాలనుకునే దేశం ప్రభుత్వరంగంలో వ్యయాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వరంగంలో ప్రయివేటుకు స్థానం కల్పించాలి. ఇలాంటి ఆర్థికవిధానాలు 1980-2014 మధ్య అమలుజేసిన దేశాల్లో ఫలితాలు ఏవిధంగా ఉన్నాయని పరిశీలిస్తే, ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగాయని పరిశోధకులు తేల్చారు. వీటి గణాంకాలు కూడా ఐఎంఎఫ్కు చేరాయి. ఐఎంఎఫ్ విధానాలు మొదలయ్యాక, ఆ దేశాల్లో అసమానతలు ప్రతీఏటా 6.5శాతం పెరిగాయి. అలా మూడేండ్లు అసమానతలు పెరిగాయి.
అభివృద్ది చెందుతోన్న దేశాల్లో చేదు ఫలితాలు
- ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకున్న అభివృధ్ధి చెందుతోన్న దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ దేశాల్లోని ఆదాయ పంపిణీ దెబ్బతిన్నది.
- ఐఎంఎఫ్ నిబంధనలకు తలూపిన దేశాల్లో ప్రభుత్వం వ్యయం ఒక్కసారిగా పడిపోయింది. తద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ఆర్థిక కష్టాలు పెరిగాయి. 2008-2011మధ్య ఆదాయ అసమానతల్ని 3.7శాతం పెంచాయి.
- వాణిజ్య, ఆర్థిక అంశాల్లో ప్రభుత్వ నియంత్రణ ఎత్తివే యాలి, అంతర్జాతీయ మార్కెట్కు తలుపులు బార్లా తెరవాలి..అన్నవి ఐఎంఎఫ్ ముఖ్య నిబంధనలు.
- దీనివల్ల మార్కెట్ లాభాలన్నీ ఒక సమూహానికి కాకుండా, వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. గత కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరిగింది ఇదే.