Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ పెట్టుబడులు వెనక్కి
- ఈక్విటీల నుంచి తరలివెళ్లిన ఎఫ్పీఐలు
- వృద్ధి రేటు మందగించడమే ప్రధాన కారణం : నిపుణులు
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులపై మోడీ సర్కారు ప్రకటించిన అంచనాలు.. మార్కెట్లో వాస్తవ పరిస్థితులకు మధ్య పొంతన లేకుండా పోతున్నది. మేకిన్ ఇండియా, కీలక రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులకు మోడీ సర్కారు మార్గాలను సుగమం చేశామంటుంటే.. విదేశీ పెట్టుబడుల్లో పురోగతి కనిపించడం లేదు. బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ మదుపరులకు సానుకూలంగా బడ్జెట్లో నిర్ణయా లు తీసుకున్నప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు, బడ్జెట్ ప్రకటించిన తర్వాత విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లుతుండటం మోడీ సర్కారును ఆందోళన పరుస్తున్నది. ఈ నెల మొదటి నుంచి 19వ తేదీ వరకు దాదాపు రూ. 7,700 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడమే ఇందుకు నిదర్శ నం. మనదేశ ఈక్విటీ మార్కెట్ నుంచి ఈ కాలంలో రూ. 7,712.12 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు(ఎఫ్పీఐ)లను విదేశీ మదుపరులు ఉపసంహరించు కున్నారు. డిపాజిటరీల నుంచి అందిన తాజా వివరాల ప్రకారం.. ఈక్విటీల నుంచి నికరంగా రూ. 7,712.12కోట్ల ఎఫ్పీఐలు ఉపసంహరించుకున్నారు. అయితే ఇదే కాలంలో డెట్ సెగ్మెంటరీలో రూ. 9,371.12 కోట్లు పెట్టారు. అంటే జులై 19వ తేదీ వరకు క్యాపిటల్ మార్కెట్(ఈక్విటీ, డెట్)లో నికర ఎఫ్పీఐ పెట్టుబడులు రూ. 1,659కోట్లుగా తేలింది. భారీమొత్తంలో ఎఫ్పీఐలు తరలిపోవడంపై మార్నింగ్ స్టార్ సంస్థలో సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ స్పందిస్తూ... బడ్జెట్లో సూపర్ రిచ్ ట్యాక్స్ను సర్కారు ప్రతిపాదించినప్పటి నుంచి ఎఫ్పీఐలు అమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోవడంతో ఎఫ్పీఐల ఉపసంహరణ జోరందుకుందని వివరించారు. వీటితోపాటు.. మనదేశపు ఈక్విటీ మార్కెట్లో లాభాలు సన్నగిల్లడం, దేశ జీడీపీ వృద్ధి మందగించడం, రుతుపవనాలు ఆలస్యంగా చేరడం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించడమూ ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఈక్విటీ మార్కెట్ ఎఫ్పీఐలకు ఎంతమాత్రం అనుకూలంగా లేదని వివరించారు. ఎఫ్పీఐల ఉపసంహరణకు అంతర్జాతీయ కారణాలూ ఉన్నాయని గ్రోవ్ సంస్థలో సీవోవోగా విధులు నిర్వహిస్తున్న హర్ష్ జైన్ తెలిపారు. అమెరికా-ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులూ విదేశీ మదుపరులను వెనుకడుగు వేయించాయని అన్నారు. దీనితోపాటు దేశంలోని కొన్ని సంస్థల త్రైమాసిక ఫలితాలు నిర్దేశించుకున్న అంచనాలను అందుకోలేకపోవడమూ మదుపరుల్లో అపనమ్మకాన్ని కలుగజేశాయని వివరించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ అదేతీరు
2014లో మోడీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ)లు భారీగా తగ్గిపోయాయి. అంతకుముందున్న ఎఫ్డీఐలు అధికమొత్తంలో వెన క్కి మళ్లాయి. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచార మే ఇందుకు నిదర్శనం. మోడీ సర్కారు అధికారంలోకి రాకముందు 2013-14లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్లో సుమారు రూ. 27,881 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2014-15 నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో ఆరున్నర వేల కోట్ల ఎఫ్డీఐలు దాటకపోవడం గమనార్హం. 2009-10లో సుమారు రూ. 1,983 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. 2012-13లో రూ. 2,807 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చేరాయి. కాగా, 2013-14లో గరిష్టంగా రూ. 27,881కి చేరిన ఈ పెట్టుబడులు మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014-15లో ఎకాఎకిన సుమారు రూ. 3,619 కోట్లకు పడిపోయాయి. తర్వాతి సంవత్సరంలో మరింతగా క్షీణించాయి. బీజేపీ హయాంలో గరిష్టంగా వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(2017-18లో) సుమారు రూ. 6,335 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. విదేశీ పెట్టుబడుల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు మోడీ సర్కారు ప్రకటనలు చేస్తుంటే.. ఎఫ్డీఐలు పెరగకుండా తగ్గిపోతున్నట్టు తెలుస్తున్నది. కాగా, 2018-19లో సుమారు రూ. 4,396 కోట్ల ఎఫ్డీఐలు మాత్రమే వచ్చాయి. అంటే అంతకు ముందు సంవత్సరం కంటే మరో రెండు వేల కోట్ల ఎఫ్డీఐలు క్షీణించడం గమనార్హం.