Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అమెరికాకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్ హైదరాబాద్లో తన టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించింది. డేటాను స్థానికీకరించాలన్న భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల మేరకు.. తాము భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టుగా పేపాల్ ఉపాధ్యక్షుడు, ఇంజినీరింగ్ విభాగం అధినేత గురు భట్ తెలిపారు. ఇది భారత్లో తమకు మూడో టెక్నాలజీ కేంద్రమని ఆయన వివరించారు. చెన్నై, బెంగళూరుల్లో ఇప్పటికే పేపాల్ టెక్నాలజీ కేంద్రాలను కలిగి ఉన్నట్టుగా ఆయన వివరించారు.
హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రం డిజిటల్ పేమెంట్స్లో డేటా సైన్సెస్, రిస్క్ మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్లపై దృష్టి సారించనుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు డిజిటల్ మోసాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు కావాల్సిన తోడ్పాటు ఈ సంస్థ ద్వారా అందుతుందని ఆయన అన్నారు. డిజిటల్ పేమెంట్స్ను మరింత భద్రంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఈ కేంద్రం తోడ్పాటును అందిస్తుందని ఆయన తెలిపారు.
భారత్ తమకు కీలకమైన వృద్ధి మార్కెట్ అని ఆయన అన్నారు. భారత ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ కేంద్రమైన హైదరాబాద్లో తాము టెక్ సెంటర్ తెరవడం తమకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో 100 ఉద్యోగులు పని చేసే అవకాశం ఉందని.. అయితే ప్రస్తుతానికి ఇందులో 60 మంది మాత్రమే పని చేస్తున్నారని అన్నారు. అవసరం మేరకు ఉద్యోగులను పెంచుతూ పోనున్నట్టుగా వివరించారు. పేపాల్ దేశంలోని మొత్తం మూడు సెంటర్లలో కలుపుకొని 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉందని ఆయన విశ్లేషించారు.