Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 31 వరకు దాఖలునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించడానికి చివరి తేదీ జులై 31తో ముగిసిపోవాల్సి ఉంది. అయితే సర్కారు ఇప్పుడు ఆ గడువును మరో నెల రోజుల పాటు పెంచి ఆగస్టు 31 వరకు పొడిగించింది. 'ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సర్కారు తెలిపింది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. రిటర్నులు సమర్పించాలని పన్ను శాఖ అధికారులు కోరారు. పోడిగించిన గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. అయితే అందుకు గాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు వివిధ రకాల సౌకర్యాలలో ప్రాధాన్యత లభించనున్న సంగతి తెలిసిందే.