Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 ఏండ్ల కనిష్ట స్థాయికి కుంగిన సేల్స్
- తొమ్మిదో నెలలోనూ కోలుకోని విక్రయాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితులకు అద్దంపడుతూ మరోసారి ఆటోమొబైల్ విక్రయాలు పడిపోయాయి. వరుసగా తొమ్మిదో నెల కూడా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు కుంగాయి. అధికారిక లెక్కల ప్రకారం జులైలో కేవలం 2,00,790 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018లో జులైలో విక్రయమైన 2,90,931 యూనిట్లతో పోలిస్తే.. ఇది 30.98శాతం తక్కువ అని 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్' (సియామ్) వెల్లడించింది. దేశీయ కార్ల విక్రయాలు 35.95శాతం తగ్గి 1,22,956 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది జులై నెలలో ఈ విక్రయాలు 1,91,979 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జులై నెలలో 18,17,406 యూనిట్ల ద్విచక్రవాహనాలు అమ్ముడవగా.. గత నెలలో ఆ సంఖ్య 16.82శాతం తగ్గి 15,11,692 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 25.71 శాతం తగ్గి 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరిల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 18.71 శాతం తగ్గాయి. 2018 జులై నెలలో 22,45,223 యూనిట్ల వాహనాలు అమ్ముడవగా.. క్రితం నెలలో కేవలం 18,25,148 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. కాగా.. ఆటోమొబైల్ రంగంలో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం 19ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2000 సంవత్సరం డిసెంబరులో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 35 శాతం పడిపోయాయి. గిరాకీ లేకపోవడంతో ఆటోమొబైల్ సంస్థల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. అమ్మకాలు పడిపోవడంతో ఇప్పటికే ఈ రంగంలో దాదాపు రూ.3.5 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు ఆటోమొబైల్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని, వ్యవస్థలో మరింత విరివిగా రుణాలు లభించేలా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.