Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావం చూపిన సూక్ష్మ గణాంకాలు
- రూ.2.2 లక్షల కోట్ల సంపద ఆవిరి
- రికార్డు స్థాయిలో లాభపడ్డ రిలయన్స్
- ఒకేరోజు 90 కోట్లు పెరిగిన ఎంక్యాప్
ముంబయి: దేశీ స్టాక్మార్కెట్లు మంగళవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలకు తోడు.. దేశీయంగా నిరుత్సాహకర సూక్ష్మ గణాంకాలు నమోదు కావడం, మార్కెట్లు ఆశిస్తున్న మదుపరుల స్నేహపూర్వక చర్యలు సర్కారు నుంచి వెలువడకపోవడం, చమురు ధరలు పెరగడం, రూపాయి పడిపోవడం వంటి పలు అంశాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. దీంతో గత రెండు సెషన్లలో లాభాలలో నడిచిన మార్కెట్లకు నష్టాల బ్రేక్ పడినట్టయింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 624 పాయింట్ల మేర నష్టపోయి 36,958 పాయింట్లకు కుప్పకూలింది. దీంతో సెన్సెక్స్ 37,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్ దిగువకు పడిపోయినట్టయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,926 పాయింట్లకు క్షీణించింది. ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, ఐటీ స్టాక్స్లో తీవ్ర అమ్మకాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులకు అద్దంపడుతూ ఐఐపీ గణాంకాలు కనిష్టానికి పడిపోవడం, వాహన అమ్మకాలు 19 ఏండ్ల కనిష్టానికి కుంగడం, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులు. అర్జెంటీనా సంక్షోభం, చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు, సంపన్నులపై పన్ను అంశం గురించి ఆర్థిక శాఖ సైలెంట్గా ఉండటం వంటి అంశాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతు న్నాయి . అంతర్జాతీ య మార్కెట్లో క్రూడా యిల్ (ముడి చమురు) ధరలు మిశ్ర మంగా కదిలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారె ల్కు 0.09 శాతం పెరుగు దలతో 54.98 డాలర్లకు ఎగసింది. మంగళవారం మార్కెట్ నష్టంతో దాదాపు రూ.2.2 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోయింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెష్టర్లు అత్యధికంగా స్టాక్స్ నుంచి నగదును ఉపసంహరించుకోవడం కనిపించింది.
రిలయన్స్ రికార్డు..
సోమవారం జరిగిని సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండిస్టీస్ పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేయడం మార్కెట్ వర్గాలను ఆకర్షించింది. రిలయన్స్లో ఆరామ్కో 20% పెట్టుబడులు కొనుగోలు చేయనుండడం, వచ్చే నెల నుంచి జియో ఫైబర్ సేవల ప్రారంభం, త్వరలో సంస్థ రుణ రహిత సంస్థగా ఎదుగనుందన్న వార్తలు మదుపరుల సెంటిమెంట్ను పెంచాయి. దీంతో మంగళ వారం ఇన్వెష్టర్లు ఈ స్టాక్ను ఎగబడి.. ఎగబడి మరీ కొన్నారు. దీంతో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు ఏకంగా 12 శాతం పెరిగింది. ఫలితంగా రిలయన్స్ ఇండిస్టీస్ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.90 వేల కోట్లకు పెరిగింది. సంస్థ మార్కెట్ విలువ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి.