Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హెచ్టీసీ చాలా రోజుల విరామం తరువాత మార్కెట్లోకి మరో ఫోన్ను విడుదల చేసింది. హెచ్టీసీ కంపెనీ బ్రాండ్ లైసెన్స్ పొందిన 'ఇన్వన్ స్మార్ట్ టెక్నాలజీ' సంస్థ హెచ్టీసీ 'వైల్డ్ ఫైర్ ఎక్స్' పేరుతో సరికొత్త ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. రెండు నానో సిమ్లు, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ వ్యవస్థ, 6.22 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, వాటర్ డ్రాప్స్టైల్ నాచ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, వెనుక వైపు 12,8, 5 మెగా పిక్సెల్తో 8ఎక్స్ జూమ్ కెమెరా సెటప్, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ కొత్త ఫోన్ ప్రత్యేకతలు. 3జీబీ/32జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.9,999గాను, 4జీబీ/128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.12,999గాను నిర్ణయించింది. రెండు వేరియంట్లలోనూ 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి కొత్తగా 'మై బడ్డీ' అనే ఫీచర్ను ఈ కొత్తఫోన్లో జోడించారు. దీనికి తోడు 6 నెలల ఉచిత యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజీ ప్రొటెక్షన్ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయాలు చేపట్టనున్నారు. హెచ్టీసీ గత ఏడాది చివరి సారిగా జూన్లో డిజైర్ 12, డిజైర్ 12 ప్లస్ పేరిట రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ఆ తరువాత సంస్థ నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల కావడం ఇదే తొలిసారి. ప్రారంభ ఆఫర్ కింద వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు రూ.3,750 విలువైన కూపన్లతో పాటు 18 నెలల పాటు రోజుకు 500 ఎంబీ చొప్పున డేటాను అందించనున్నారు. వొడాఫోన్ యాప్లో ఈ కూపన్లను రీఛార్జి కోసం వినియోగించుకోవచ్చు.