Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎన్బీఎఫ్సీ'లను ప్రోత్సహిస్తూ ఆర్బీఐ సూచనలు
- మొత్తం బ్యాంకింగ్ రంగాన్నే ముంచుతుంది : ఫిచ్
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకింగేతర విత్త సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) బాసటగా నిలిచేందుకు గాను ఆ సంస్థలకు, రిటైల్ రుణ గ్రహీతలకు.. విరివిగా రుణాలను అందించాలంటూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల వాణిజ్య బ్యాంకులకు సూచించింది. పెద్ద బ్యాంక్ చేసిన ఈ సూచన ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో వివాదాస్పదం అవుతోంది. ఆర్బీఐ చర్య వల్ల అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నిరర్థక ఆస్తుల చట్రంలో ఇరుక్కొని తీవ్ర ఇబ్బంది పడుతున్న బ్యాంకులు ఎన్బీఐఎఫ్సీలకు మరిన్ని రుణాలను అందిస్తే ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
మందగమనం పేరుతో ఆలోచన లేని నిర్ణయం..
మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవస్థలో విరివిగా రుణాలు అందించే విత్త సంస్థలుగా ప్రజల్లో ఎన్బీఎఫ్సీలకు మరచి పేరుంది. అక్కడికి వెళితే బ్యాంకుల కంటే తక్కువ సమయంలో.. ఎలాంటి ఎక్కువ విచారణలు లేకుండా రుణాలు లభిస్తాయని సమాజంలో ఒక నమ్మకం ఉంది. దీనికి తోడు ఆయా సంస్థల విస్తృతి బ్యాంకుల విస్తృతి కంటే కూడా ఎక్కువగా ఉండడంతో బ్యాంకుల కంటే కూడా ఎక్కువగా ప్రజలు వివిధ అవసరాలకు కావాల్సిన రుణాల కోసం ఎన్బీఎఫ్సీల గడపతొక్కుతున్నారు. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్షియల్, హెచ్డీబీ, ముత్తూట్, చోళమండలం, ఆదిత్య బిర్లా, టాటా క్యాపిటల్, క్యాపిటల్ ఫస్ట్, మణప్పురం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వంటి సంస్థలు మనదేశంలో ప్రముఖ ఎన్బీఎఫ్సీ కంపెనీలుగా చెలామణి అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితుల కారణంగా ఆయా సంస్థలు ఇచ్చిన రుణాలు వివిధ ప్రాజెక్టులో ఇరుక్కుపోయి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు వీటి ప్రధాన వ్యాపారం. తక్కువ వడ్డీకి బ్యాంకులు ఇతర సంస్థల నుంచి రుణాలు పొంది, అధిక వడ్డీ కలిగిన రుణాలు వినియోగదారులకు అందజేస్తుంటాయి. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి ఎన్బీఎఫ్సీల కార్యకలాపాలు మనదేశంలో విపరీతంగా పెరిగాయి. బ్యాంకుల ద్వారా ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో తీసుకొస్తున్నారు. అయితే అసలు సమస్య ఏంటంటే, ఎన్బీఎఫ్సీలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు 'హై రిస్క్'తో కూడుకున్నవి. ఎన్బీఎఫ్సీ కంపెనీ మునిగితే, అప్పులు ఇచ్చిన బ్యాంకు కూడా మునుగుతుంది. ఎన్బీఎఫ్సీ కంపెనీ 'ఐఎల్ఎఫ్ఎస్' విషయంలో ఇదే జరిగింది. ఈ సంస్థలో కుంభకోణం నేపథ్యంలో ఈరంగంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. 'ఐఎల్ఎఫ్ఎస్'కు రుణాలు ఇచ్చిన ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు మునిగాయి. అప్పుడు బ్యాంకులకు ఇప్పుడున్న కష్టాలకు తోడు కొత్త కష్టాలు వచ్చిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017 నుంచి ఆర్బీఐ పాలసీలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. బ్యాంకుల ఫైనాన్స్ ప్రొఫైల్లో అధిక మొత్తం రుణాలుగా 'ఎన్బీఎఫ్సీ'లకు వెళ్తున్నాయి. దిగజారుతున్న ఆర్థికవ్యవస్థను సరిచేయడానికి, డిమాండ్ను పెంచడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నామని ఆర్బీఐ తన 'మానిటరీ పాలసీ'లో సమర్థించుకుంటోంది. దీనివల్ల వేరే రంగాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకుల వద్ద నిధులు ఉండే పరిస్థితి లేదు. ఆటోమొబైల్ రంగం నేడు సంక్షోభంలో చిక్కుకోవడానికి గల ప్రధాన కారణాలలో ఇదీ ఒకటి. ఒక బ్యాంకు 'ఫైనాన్స్ ప్రొఫైల్'లో 'ఎన్బీఎఫ్సీ'లకు ఇచ్చే రుణాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 'ఫైనాన్స్ ప్రొఫైల్'లో అధికభాగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలి.
మరింత ప్రమాదం పొంచి ఉంది...
'నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ'(ఎన్బీఎఫ్సీ)లకు బ్యాంకులు ఇచ్చే రుణాలు మరింత పెంచాలంటూ ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని 'ఫిచ్ రేటింగ్స్' తప్పుబట్టింది. విధానపరమైన ఈ నిర్ణయం భారతీయ బ్యాంకుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని 'ఫిచ్' తాజాగా హెచ్చరించింది. బ్యాంకుల 'ఫైనాన్స్ ప్రొఫైల్'లో హై రిస్క్తో కూడిన రుణాలు పెరగటం ఎంతమాత్రమూ మంచిది కాదని తెలిపింది.