Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు గాను రానున్న రోజుల్లో దాదాపు రూ.100 లక్షల కోట్ల మేర నిధులను ఖర్చు చేయనున్నట్టుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో ఆధునాత పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు గాను జీఎస్టీ, దివాలా చట్టం వంటి పలు సంస్కరణలను అమలులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు.
గురువారం ఎర్రకోటలో జరిగిన 73 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలను దేశానికి సంపద అని అభివర్ణించారు. దేశానికి సంపదను సృష్టిస్తున్న కార్పొరేట్లను అనుమానంతో చూడడం తగదని వారిని గౌరవించాలని అన్నారు. దేశంలో సంపద సృష్టి అనేది చాలా ఆవశ్యకమని ప్రధాన మంత్రి అన్నారు. దేశంలో సంపద సృష్టించబడినప్పుడే దానిని పంపిణీ చేయడానికి వీలు పడుతుందని ఆయన అన్నారు. కావున దేశంలో సంపద సృష్టికి కృషిచేస్తున్న కార్పొరేట్లను తగు విధంగా గౌరవిద్దామని అన్నారు.
స్వయంగా దేశ ప్రధానే కార్పొరేట్ పక్షాన నిలుస్తూ వ్యాక్యలు చేయడం ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. గతేడాది అక్టోబరులో కూడా ప్రధాన మంత్రి ఇదే విధంగా స్పందిస్తూ కార్పొరేట్లను నిందించే సంస్కృతిని తాను విశ్వసించనని అన్నారు. కార్పొరేట్లు దేశంలో వ్యాపారాలు చేయడం ఒకెత్తయితే.. వారు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారంటూ మోడీ వారిని ప్రశంసించారు.