Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: మందగమన పరిస్థితుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు గాను ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ శుక్రవారం ధ్రువీకరించారు. ఆర్థిక శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య నిరంతరాయం చర్చలు జరుతున్న విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీతారామన్ స్పందించారు. ఈ విషయమై గురువారం తాము ప్రధాన మంత్రితో చర్చలు జరిపామని.. త్వరలోనే మరో సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని నిర్మలా తెలిపారు. అయితే ఉద్దీపన ప్యాకేజీని ఏ విధంగా అందించనున్నారు.. ఎప్పటిలోగా అందిస్తారన్న విషయాన్ని వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. ఉద్దీపన ప్యాకేజీ కసరత్తు పూర్తయిన తరువాత తాము ఈ విషయన్ని అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. ఇటీవల బ్యాంకులు, ఎస్ఎంఈలు, ఆర్థిక రంగం, ఆటోమొబైల్ రంగం వారితో తాము జరిపిన చర్చల వివరాలను నిర్మలా వెల్లడిస్తూ.. ఆయా రంగాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా తెలుసుకున్నామని.. విటిని విశ్లేషించుకొని త్వరలోనే వీటికి పరిష్కారాలు కనుగోనేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తాము తీసుకుంటున్న చర్యల కారణంగా నల్లధనం బయటకు వస్తోందని.. వాటిని జప్తుచేస్తూ అవి మార్కెట్లోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టుగా మంత్రి తెలిపారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి గుజరాత్లోని ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో మంత్రి మైసూర్, గౌహతి, కాన్పూరుతో పాటు వివిధ ద్వితీయ శ్రేణి నగరాలలోనూ మెట్రో నగరాలలోనూ పర్యటించనున్నారు. దేశంలో సంపద సృష్టిస్తున్నవారిని గౌరవించాలని ప్రధాన మంత్రి సూచించారని.. ఈ నేపథ్యంలో పన్ను అధికారులు కూడా సంపన్నులను పన్ను వసూళ్లకై వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదని మంత్రి పన్ను అధికారులకు సూచించినట్టుగా సమాచారం. అందుబాటులో ఉన్న సాంకేతీకతను వాడుకుంటూ పన్ను బకాయిల విషయమై సంపన్నులను ప్రశ్నించాలని ఆమె సూచించారు. అయితే వచ్చే వారంలోగా సర్కారు ఉద్దీపన ప్యాకేజీకి తుదిమెరుగులద్ది ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.