Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాపకింద నీరులా విస్తరిస్తోన్న మాంద్యం
- ప్రపంచ వ్యాప్తంగా మొదలైన ప్రభావం
- రానున్న ఏడాది ఆర్థికానికి తీవ్ర అవస్థే
- తగిన జాగ్రత్త తీసుకోకుంటే ఇబ్బందులే!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచంలో రెసిషన్ (ఆర్థిక మాంద్యం) జాడలు విస్తరిస్తున్నాయి. ఏ దేశంలో చూసినా డిమాండ్ పడిపోవడం, ఉత్పత్తి కార్యకలాపాలు కుంటుపడడం, స్టాక్ మార్కెట్లు కనిష్టాలకు పడిపోవడం, ఉద్యోగ కోతలు వంటి ఆర్థిక విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. దాదాపు దశాబ్దం కాలం కిందట అమెరికా సబ్ప్రైమ్తో మొదలై ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యం పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతాయా అనే అనుమానాలు కదులుతున్నాయి. వివిధ దేశాల బ్యాంకులు, రేటింగ్ సంస్థలు కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే రానున్న 9-12 నెలల్లో మాంద్యం అన్ని దేశాలకు వ్యాపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిలోపు అగ్రరాజ్యం అమెరికా మాంద్యంలోకి పడిపోయే ప్రమాదం కనిపిస్తోందని స్వయంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ఆ ప్రభావం కొన్ని దేశాలలో మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏడాది లోపే ప్రపంచం రెసిషన్లోకి జారుకొనే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ సంస్థ కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాక మానదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరిపై ప్రభావం..
అగ్రరాజ్యం దూకుడుతో మొదలైన అమెరికా-చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం చినికిచినికి గాలివానగా మారి ఉప్పెనలా ప్రపంచదేశాలన్నింటినీ ముంచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాలూ ఇలా సుంకాలు విధించుకుంటూ పోతే ప్రపంచ వృద్ధిరేటు ఏడేళ్ల కనిష్ఠస్థాయి.. అంటే 2.8 శాతానికి పడిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే రాబోయే మూడు త్రైమాసికాల్లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి పడిపోవడం ఖాయం. మాంద్యం వస్తే ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఈ ప్రభావం కనిపించక మానదు. గతానుభవాన్ని బట్టి చూస్తే మాంద్యం కారణంగా ఇతర దేశాలు విపణులుగా పనిచేసే పరిశ్రమలు బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రధానం ఐటీ, ఫార్మా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. కంపెనీలు బడ్జెట్ను తగ్గించుకోవడంతో ఈ రంగాలలో ఆర్డర్లు తగ్గి ఉత్పత్తి ప్రభావితమవుతుంది. ఫలితంగా ఐటీ, బీపీవో, కేపీవో రంగాలలో వేలాదిగా కొలువులు కొండెక్కే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమ దెబ్బతింటే దాని ప్రభావం ప్రత్యక్షంగా స్థిరాస్తి రంగం, వాహన రంగంపై ప్రతిబింబిస్తుంది. దీంతో ఉత్పత్తి కుంటుపడి ఉద్యోగాలు ఊడుతాయి. కాబట్టి ఈ రంగాలలో పని చేస్తున్న వారు ఇప్పటి నుంచే ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మేలని విశ్లేషకులు చెబుతన్నారు.