Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సమాజంలోని అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా బ్యాంకు సిబ్బంది తమ రుణ వితరణలను జరపాలని సెంట్రల్ బ్యాంక్ ఇండియా (సీబీఐ) ముంబయి కేంద్ర కార్యాలయం జనరల్ మేనేజర్ ఎస్.ఆర్.దాశ్ అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో సెంట్రల్ బ్యాంక్ ఇండియాకు చెందిన హైదరాబాద్, వరంగల్ రీజినల్ కార్యాలయాల పరిధిలోని బ్యాంక్ బ్రాంచీల సిబ్బంది సమాలోచనల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేసిన దాశ్ మాట్లాడుతూ సమాజంలోని అన్నివర్గాల వారి ఆకాంక్షలను నెరవేర్చేలా బ్యాంకింగ్ సిబ్బంది తన రుణ వితరణ ప్రణాళికలను సిద్ధ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీనియర్ సిటజన్లు, యువత, విద్యార్థులు ఆకాంక్షలు నెరవేరేలా సిబ్బంది రుణ వితరణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రుణ వితరణకు ఎదురవుతున్న అవరోధాలు, వాటిని ఎదుర్కొనేందుకు గాను పాటించాల్సిన విధానాలపై ఈ కార్యక్రమంలో నిర్మాణాత్మక చర్చ జరిగింది. పలు బ్రాంచీలకు చెందిన సిబ్బంది బ్యాంకు వ్యాపార విస్తరణలో ఎదురవుతున్న సమస్యలను ఈ సమావేశంలో ఏకరువు పెట్టారు. వీటికి పరిష్కారాలను సూచించాల్సిందిగా వారు కేంద్ర కార్యాలయ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. యువతకు తోడ్పాటను అందించేలా ఎంఎస్ఎంఈలకు రుణ వితరణ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సదస్సలో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. ఇందుకు గాను ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అవసరమనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.