Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాయత్తమవుతున్న ఆయిల్ కంపెనీలు..
- డీజిల్ డోర్ డెలివరీ సక్సెస్తో కొత్త ప్లాన్!
ముంబయి: వినియోగదారులకు మరింత సులువుగా పెట్రోలును అందుబాటులో ఉంచేందుకు గాను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటి వరకు డోర్ డెలివరీ ద్వారా డీజిల్ను అందిస్తున్న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు.. ఇక నుంచి పెట్రోల్కు సైతం ఆ సదుపాయాన్ని విస్తరించాలని యోచిస్తున్నాయట. ''ఇంధన డోర్ డెలివరీ సేవలకు మంచి స్పందన వస్తోంది. పటిష్ట భద్రతాపరమైన చర్యలతో ఈ సేవల్ని మరింత విస్తరించాలని భావిస్తున్నాం'' అని హెచ్పీసీఎల్ చైైర్మన్ ఎం.కె.సురానా గత వారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం డీజిల్ డోర్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) త్వరలో పెట్రోల్కి కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని నగరాలకే పరిమితమైన డీజిల్ డోర్ డెలివరీ సేవలను మరో 20 నగరాలకు విస్తరించాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం 35 నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సౌకర్యం ఉంది. అందులో ఐఓసీ 15, బీపీసీఎల్ 13, హెచ్పీసీఎల్ 7 నగరాల్లో డోర్ డెలివరీ సేవల్ని అందిస్తోంది. చమురు మార్కెటింగ్ సంస్థలైన హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సేవల్ని అందిస్తున్నాయి. ఇందుకు గాను తాజాగా మరో 500 డోర్ డెలివరీ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఈ సంస్థలు యోచిస్తున్నట్టు సమాచారం. భారీ పరిమాణంలో కొనే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఒకేసారి 2000 లీటర్లకు మించి ఇంధనాన్ని కొనాలంటే పెసో అనుమతి తప్పనిసరి. తాజాగా ఐఓసీకి 4, బీపీసీఎల్కి 10, హెచ్పీసీఎల్కి 6 నగరాల్లో కొత్తగా అనునుమతులు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సర్కారు నుంచి అనుమతులు లభిస్తే కేవలం కొన్ని నెలల సమయంలోనే పెట్రోలు డోర్ డెలివరీ కల నెరవేరనుంది.