Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ 10లో తొమ్మిది సంస్థల ఎమ్-క్యాప్ భారీగా పతనం
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎమ్-క్యాప్) విలువలు భారీగా పతనమయ్యాయి. టాప్ 10 భారతీయ కంపెనీల్లో తొమ్మిదింటికి గతవారం కలిసిరాలేదు. రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) మినహా తొమ్మిది దిగ్గజ దేశీయ కంపెనీలు మొత్తంగా రూ. 84,354.1 కోట్ల విలువను నష్టపోయాయి. గతవారం మొదట్లో ఆర్ఐఎల్ తన వార్షిక సమావేశంలో మదుపరులకు ఆకర్షణీయమైన అంశాలను ప్రతిపాదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 72,153 కోట్లను రాబట్టింది. దీంతో ఆ కంపెనీ ఎమ్-క్యాప్ విలువ రూ. 8,09,755 కోట్లకు చేరింది. కాగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీలివర్ లిమిటెడ్(హెచ్యూఎల్), హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు గతవారం ఎమ్-క్యాప్ విలువలను నష్టపోయాయి. ఇందులోనూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్లో అధికంగా తన విలువను కోల్పోయింది. శుక్రవారంనాటికి టీసీఎస్ రూ. 30,807 కోట్లు పతనమై మార్కెట్ విలువను రూ. 8,11,828 కోట్లకు దిగజార్చుకుంది. కాగా, హెచ్డీఎఫ్సీ విలువ రూ. 19,495 కోట్లను కోల్పోవడంతో ఎమ్-క్యాప్ విలువ రూ. 3.6లక్షల కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 15వేల కోట్లను నష్టపోయి మార్కెట్ విలువ రూ. 6లక్షలకు చేరింది. ఇన్ఫోసిస్ రూ. 6.7 వేల కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 6.5 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. హెచ్యూఎల్ రూ. 2.9 వేల కోట్లు, ఐటీసీ రూ. 1.6వేల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 790 కోట్లు, ఎస్బీఐ రూ. 356 కోట్ల మార్కెట్ విలువలను నష్టపోయాయి. అయినప్పటికీ టాప్ టెన్ దేశీయ దిగ్గజ కంపెనీల్లో మొదటిస్థానం( ఎమ్-క్యాప్రూ. 8,11,828 కోట్లు)లో అత్యధికంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయిన టీసీఎస్ కొనసాగుతుండటం గమనార్హం. టీసీఎస్ తర్వాత వరుసగా రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు ఉన్నాయి