Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజల జీవనావసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తూ.. జాతీయ ప్రయోజనాల సాధన దిశగా బ్యాంక్ సిబ్బంది కృషి చేయాలని ఆంధ్రాబ్యాంక్ ఎండీ, సీఈవో ఫకీర్స్వామి అన్నారు. ఆంధ్రాబ్యాంక్ హైదరాబాద్ జోన్-1 కార్యాలయం పరిధిలో రెండు రోజుల పాటు జరిగిన క్షేత్రస్థాయి సిబ్బందితో సమాలోచనల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కె.రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ కొత్త ఆలోచనలను అమలు చేయడం ద్వారా ప్రతి శాఖ లాభాల దిశగా పయనించేలా కార్యచరణను తయారు చేసుకొని ముందుకు సాగాలని అన్నారు.
ఈ సమాలోచనల సదస్సులో జోనల్ పరిధిలోని దాదాపు 67 శాఖలకు చెందిన అధినేతలు, ఉన్నతాధికారులు పాల్గొని బ్యాంకింగ్ అభివృద్ధికి ఎదురవుతున్న అవరోధాలను గురించి అధికారులకు వెల్లడించారు. బ్యాంక్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఈ మీటింగ్లో సమీక్షించారు. జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని, సులభ రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న మధ్యతరహా వ్యాపారాలకు, గృహ, విద్య మరియు స్వయం సహాయక సంఘాలకు రుణసౌకర్యం మరింత మెరుగు పరిచే దిశగా చర్యలు చేపట్టాలని వారు సూచించార. సీఎస్ఆర్ కార్యక్రమాల నిర్వహణకు చేయూతనివ్వడం, ఆర్థిక సమ్మిళిత పథకాల అమలులో తగిన చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ అధికారులు బ్యాంక్ అభివృద్ధికి పలు సూచనలు చేశారు.