Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థ అంతా బాగుందని చెప్పలేం..
- ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నాం
- సెంటిమెంట్ మెరుగు పరిచే కృషి చేస్తున్నాం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలు సమస్యలు ఆందోళనకరంగా ఉన్నాయన్న సంగతిని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం నర్మగర్భంగా ఒప్పుకున్నారు. స్థానికంగా ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న విషయం వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నా.. తాము అంతా బాగుందనే భావన కలిగించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దుర్భర పరిస్థితి, చీకట్లను గురించి ఆలోచిస్తూ దిగాలు కూర్చుంటే ఒరిగేది ఏమీలేదని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు పనికి రాదని ఆయన అన్నారు. ఈ భావనను ప్రజల నుంచి దూరం చేసేందుకే తాము కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొంటూ.. ప్రజలకు మేలు చేసేలా ధైర్యం నింపే విధంగా ప్రవర్తిస్తూ.. అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సమస్యలతో పాటుగా భవిష్యత్తులో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి కూడా భారతీయులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. భారతీయుల సెంటిమెంట్ను పెంచేందుకే తాము చిరునవ్వులతో కూడిన నిర్మాణాత్మక చర్యలను తీసుకుంటూ ముందుకు వెలుతున్నట్టుగా శక్తికాంత తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు సెంటిమెంట్ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. సెంటిమెంట్ ఒక్కసారి దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం గణనీయంగా ఉంటుందని వివరించారు. సాధారణంగా ప్రజల మనస్తత్వం అస్థిత్వ బెంగ నుంచి సానుకూలం దిశగా కొనసాగుతూ ఉంటుందని.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోని దిగాలు పరిస్థితులపైనే దృష్టి సారిస్తే ఈ సెంటిమెంట్ ప్రభావితమయ్య అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజల మూడ్ను పెంపొందించే దిశగా, ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉందని చెప్పే దిశగా ఇటీవల వార్తా పత్రికల్లో గానీ.. టీవీల్లో గానీ కథనాలు రాకపోవడాన్ని తాను గమనించానని ఆయన అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు సూచిక అని ఆయ అంగీకరించారు. ఆర్థిక వ్యవస్థ పడిపోతుండడం, నిరుద్యోగం నాలుగు దశాబ్దాల కిందటి స్థాయికి పెరిగిపోవడంతో పాటు ఇతర సూక్ష్మ గణాంకాలపై వార్త పత్రికల్లో వస్తున్న విశ్లేషణాత్మక కథనాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరిస్తూ ఇలాంటి వాటి వల్ల వాస్తవంగా ఒరిగేదేమీ లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల సెంటిమెంట్ బలపడి ఆర్థిక వ్యవస్థకు మేలు జరగుతుందని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుందని తెలిపారు. ఈ షాక్లను తట్టుకొనేలా బ్యాంకులు జాగురుకతతో ఉండాలన్నారు. దివాలా పరిష్కార చట్టం సవరించడం బ్యాంకులకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మూలధనం కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా మార్కెట్లపై ఆధారపడాలని సూచించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమల్లోకి తెచ్చిన అన్ని నిబంధనలు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తాయన్నారు. ఆర్బీఐ కొన్ని నిబంధనలను పునరుద్ధరిస్తుందని కూడా చెప్పారు. మరిన్ని బ్యాంకులు రెపోరేటుతో రుణాలు, డిపాజిట్లను అనుసంధానించాలన్నారు.