Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదివేల ఉద్యోగాలకు కోత..
- నానాటికీ పడిపోతున్న అమ్మకాలు
- జీఎస్టీతో నష్టాల బాటలోకి..
- సర్కారు జోక్యం చేసుకోపోతే మనుగడ ప్రశ్నార్థకం : సంస్థ ప్రతినిధులు
- అదేదారిలో బ్రిటానియా
ముంబయి : సుమారు తొంబై ఏండ్లుగా భారతీయుల ఇండ్లల్లో చోటు సంపాదించుకున్న ప్రముఖ బిస్కెట్ ఉత్పత్తుల సంస్థ పార్లే-జీ.. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి విలవిల్లాడుతున్నది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న అనాలోచిత ఆర్థిక నిర్ణయాల ఫలితంగా దేశంలో ప్రయివేటు సంస్థలు కుదేలవుతున్న మాదిరిగానే.. పార్లే-జీ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాలను తీసేయాలని నిర్ణయిం చినట్టు అనధికారిక సమాచారం. ఇవే పరిస్థితులు కొనసాగితే దాదాపు పదివేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి మయాంక్ షా అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. 'పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే సుమారు 8 వేల నుంచి 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.
1929లో ఏర్పాటైన పార్లే-జీ.. బిస్కెట్ అమ్మకాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా 125 తయారీ సంస్థలున్నాయి. కాగా, 2017లో మోడీ సర్కారు తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తో పార్లే-జీ అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టడానికి ముందు వంద గ్రాముల బిస్కెట్ ప్యాకెట్ మీద 12 శాతం పన్ను విధించేవారు. కానీ జీఎస్టీ తర్వాత అది 18 శాతానికి చేరింది. దీంతో చిన్న బిస్కెట్ ప్యాకెట్ల మీద కూడా ధరలు పెంచాల్సి వచ్చిందని షా చెప్పారు. ఈ కారణంగా అమ్మకాలు పడిపోయాయని ఆయన తెలిపారు. గ్రామీణ విపణి నుంచి ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యేవనీ, కానీ రెండేండ్ల నుంచి అక్కడా అమ్మకాలు దారుణంగా పడిపోయాయని చెప్పారు. అధిక పన్నుల కారణంగా రూ. 5 బిస్కెట్ ప్యాకెట్లలో బిస్కెట్ల సంఖ్య తగ్గి, ధరలు పెరుగుతుండటంతో చిన్న ప్యాకెట్ను కొనడానికి సైతం వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని అన్నారు.
బిస్కెట్లను 18 శాతం స్లాబ్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కేంద్రానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని షా వాపోయారు. దీనిని సమీక్షించాలని ప్రస్తుత ఆర్థిక మంత్రికి సైతం లేఖలు రాసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా లేదని ఆయన తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తమ సంస్థతో పాటు బిస్కెట్ తయారీ పరిశ్రమల మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లే-జీతో పాటు దాని ప్రధాన పోటీదారుగా ఉన్న బ్రిటానియా బిస్కెట్ల అమ్మకాలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. రూ. 5 బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి సైతం వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని బ్రిటానియా సంస్థ ఎండీ వరుణ్ బెర్రీ చెప్పారు. మరోవైపు బుధవారం ఆ సంస్థ షేర్లు 1.5 శాతం పడిపోయాయి. నీల్సన్ అండ్ నీల్సన్ సర్వే వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం.. గత నెలలో తొందరగా అమ్ముడుపోయిన వస్తువుల (ఎఫ్ఎంసీజీ)ల్లో 9-10 శాతం వృద్ధిక్షీణించిందని తెలిపింది.
ఆర్థిక మందగమనంతో దేశంలో ఇప్పటికే ఆటోమొబైల్ రంగం మునుపెన్నడూ లేని విధంగా కుదేలవుతున్నది. ఈ రంగంలో ఇప్పటికే సుమారు 2.50 లక్షల ఉద్యోగాలు పోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్తో పాటు రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో పాటు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించుకుపోతే దేశం మాంధ్యం భారీన పడే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నా.. మోడీ సర్కారు మాత్రం అంతా సవ్యంగానే ఉన్నదంటూ ప్రకటనలు గుప్పిస్తుండటం గమనార్హం.