Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబ్ సేవల వల్లే వాహనాల అమ్మకాలు డల్
- దేశంలో యువత ఆలోచనా తీరు మారుతోంది
- అందుకే ఈ మందగమనం
- పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సిందే
- దేశంలో జీఎస్టీ విస్తృతి మరింతగా పెరగాలి..
- ఆర్థికాన్ని నిలబేట్టేలా చర్యలు తీసుకుంటున్నాం: 100 రోజల పాలనపై ఆర్థిక మంత్రి సీతారామన్
చెన్నై: దేశంలో ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న తీవ్ర గడ్డు పరిస్థితికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన రీతిలో ప్రధాన కారణాన్ని విశ్లేషించారు. ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలుకు పెద్దగా ముందుకు రావడం లేదని అన్నారు. అప్పు చేసి కొత్త వాహనాలను కొని ఈఎంఐల భారం మోసేందుకు యువత ఇష్టపడటం లేదని, ఓలా..ఉబర్లు అందిస్తోన్న క్యాబ్స్ సేవలను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మిలీనియల్స్ క్యాబ్లకే మొగ్గుచూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోంద ని చెప్పారు. కార్లు, ద్విచక్రవాహన విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని సమర్థంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేం దుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థలోని పలు అంశాలపై సుదీర్ఘ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీయే కాకుండా దేశవ్యాప్తంగా సమాచారం క్రోడీకరిస్తోందని తెలిపారు. ఆటో రంగంలో అమ్మకాలు తగ్గి కొలువులు కొండెక్కుతుండడంపై స్పందిస్తూ కొత్తగా కొనుగోలు చేసే బీఎస్-4 వాహనాలు పూర్తి రిజిస్ట్రేషన్ కాలం వాడుకొనేలా చర్యలు చేపడుతున్నామని.. దీనికి తోడు వచ్చే మార్చి ముగింపు వరకు కొనుగోలుచేసే వాహనాలకు అదనంగా మరో 15 శాతం మేర తరుగు సౌకర్యం కలిపిస్తున్నట్టుగా వివరించారు.
ప్రజల్లో విశ్వాసం నింపాల్సి ఉంది..
ప్రస్తుత మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని బ్యాంకులు రుణ వితరణ సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. వినిమయం తగ్గిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనేందు కు ముందుకొచ్చే వారి సంఖ్య తగ్గుతోందని.. దీంతో రుణ వితరణ సమస్య పెరుగుతోందని మంత్రి పరోక్షంగా విశ్లేషించారు. ఈ సమస్య పరిష్కారానికి రుణాల సేకరణను పెంచేందుకు గాను మార్కెట్లో విశ్వాసాన్ని నింపేలా తగిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీతారామన్ అభిప్రాయ పడ్డారు. ఇటీవల సర్కారు ప్రకటించిన బ్యాంకుల విలీనాన్ని సీతారామన్ మరోమారు సమర్థించుకు న్నారు. బ్యాంకుల విలీన తేదీలను ఆయా బ్యాంక్ బోర్డులే నిర్ణయించుకుంటాయని నిర్మలా సీతారమన్ తెలిపారు. విలీనం వల్ల ఒకదానికొకటి బలంగా నిలిచి దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. వృద్ధిపథంలో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థకు మంచి బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అందుకే బ్యాంకుల విలీనం చేపట్టినట్టుగా తెలిపారు.
మౌలిక రంగంపై టాస్క్ఫోర్స్..
దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి గాను మోడీ సర్కారు పెద్దపీట వేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన విధంగా రానున్న ఐదేండ్ల కాలంలో దాదాపు 100 లక్షల కోట్ల మేర పెట్టుబడుల పెట్టేందుకు తామ సిద్ధంగా ఉన్నామని సీతారామన్ వివరించారు. ఇందుకు గాను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ టాస్క్ఫోర్స్ దేశ వ్యాప్తంగా ఏయే మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు అవసరం ఉన్నాయో గుర్తించడంతో పాటు ఏయే ప్రాజెక్టులను వేగవంతం చేయాలనే అంశంపై సర్కారు సూచనలు చేయనుందని నిర్మలా తెలిపారు. టాస్క్ఫోర్స్ నివేదిక అందగానే సర్కారు ఆయా ప్రాజెక్టులకు సాయం చేయడం మొదలుపెడుతుందని నిర్మలా తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు కూడా ఉండనున్నాయని వివరించారు.
100 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నాం..
మోడీ నేతృత్వంలో కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం గడిచిన 100 రోజుల పాలనా కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ రానున్న ఐదేండ్ల కాలంలో భారత్ను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు గాను సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. లక్షలాది ఉద్యోగాల కల్పనకు గాను దేశంలో మౌలిక రంగాన్ని దృఢమైన అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టినట్టుగా ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకలను మరింతగా బలోపేతం చేసేందుకు గాను రూ.55,250 కోట్ల మేర మూలధన సాయాన్ని ప్రకటించినట్టుగా నిర్మల వివరించారు. ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రస్తుతం వేస్తోన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించే విషయంలో ఆర్థిక మంత్రి భరోసా ఇవ్వలేదు. ఈ విషయంలో తాను ఒక్కదానినే నిర్ణయం తీసుకోలేనని జీఎస్టీ మండలి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో ఆటోమొబైల్ రంగం నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని.. త్వరలోనే ఈ దిశగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
వృద్ధి పడిపోవడం సహజమే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోవడాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా లైట్గా తీసుకున్నారు. వృద్ధి పథంలో ఒడుదుడుకులు (హెచ్చు తగ్గులు) సహజమేనని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తగు విధంగా స్పందిస్తూనే వస్తోందని నిర్మల వివరించారు. దేశంలో డిమాండ్ను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. వృద్ధి చట్రంలో జీడీపీ అనేది ఒక భాగమేనని.. దీనిని మెరుగుపరచాలనే స్పృహతో సర్కారు ముందుకు సాగుతోందని వివరించారు. రానున్న త్రైమాసికాల్లో జీడీపీని ఎలా పెంచాలన్న దానిపైనే సర్కారు ప్రధానంగా దృష్టి సారిస్తోందని ఆమె తెలిపారు. మార్కెట్లో వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేందుకు గాను తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా వివరించారు. ఆటోమొబైల్ విడిపరికరాల పరిశ్రలమలను ఆదుకొనేందుకు గాను ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న మందగమన పరిస్థితుల పట్ల మేటిగా స్పందించాల్సిన అవసరాన్ని సర్కారు గుర్తించి తగిన చర్యలను చేపడుతున్నట్టుగా వివరించారు. గృహ కొనుగోళ్లను పెంచేందుకు గాను వారి డిమాండ్లను తీర్చే విషయంలోనూ సర్కారు త్వరలోనే ప్రతిస్పందించనుందని ఆమె తెలిపారు. మోడీ సర్కారు అనాలోచితంగా ఆఘమేఘాల మీద అమలులోకి తీసుకువచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం తగ్గుతుండడాన్ని నిర్మాలా సీతారామన్ అంగీకరించారు. పన్ను ఆదాయం పెంచేందుకు గాను అధికారులు వసూళ్లపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని.. పన్ను విస్తృతిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీతారామన్ తెలిపారు.