Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివాలా జాబితాలో రియల్ ఎస్టేట్ రెండో స్థానం
- చేయూతనిచ్చిన ప్రయోజనం శూన్యం : విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. ఈ రంగాన్ని సంస్కరించేందుకు కేంద్ర సర్కారు పూర్తికాని హౌజింగ్ ప్రాజెక్టులకు మద్దతుగా పదివేల కోట్లతో హౌజింగ్ ఫండ్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మధ్యాదాయ వర్గాల హౌజింగ్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసేందుకు ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక విండోలను ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. అయితే, ఇందులో లిటిగేషన్లో ఉన్న, ఎన్పీఏ ప్రాజెక్టులకు సంబంధించి ఊరట లభించడం లేదు. కానీ, జూన్ వరకు అందిన సమాచారం ప్రకారం.. దేశంలో దివాళా కేసులు అధికంగా ఉన్న జాబితాలో రియల్ ఎస్టేట్ రంగం రెండోస్థానంలో ఉండటం గమనార్హం. సర్కారు ప్రకటించిన ఉద్దీపనలు ప్రధాన సమస్యను గుర్తించడం లేదు. ప్రస్తుతం చాలా నగరాల్లో మెజార్టీగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఈ కోవలోనే ఉండగా.. వాటికే మద్దతు లభించకుండాపోతున్నదని ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలపై ఆ రంగంలోని ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ రంగంలో నెలకొన్న కీలక సమస్యలను విస్మరించిందని అభిప్రాయపడుతున్నారు. తమ డిమాండ్లు, తాము ఆశించనమేర ప్రభుత్వ చర్యలు లేవని చెబుతున్నారు. మోడీ సర్కారు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం, జీఎస్టీ అమలులతో రియల్ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయింది. డెవలపర్స్ పెట్టుబడులు సమకూర్చుకోవడం కష్టంగా మారిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనీ, కేంద్రం చర్యలు ఎంతమాత్రం సరిపోవని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడారు) చైర్మెన్ జక్షరు షా అన్నారు. ప్రభుత్వం కేవలం పైపైన మెరుగులద్దే ప్రయత్నం చేస్తున్నదనీ విమర్శించారు. దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కేంద్రం ప్రకటించిన నిర్ణయం సహాయపడదని హీరానందని గ్రూప్ వ్యవస్థాపకులు నిరంజన్ హీరానందని తెలిపారు. ఎందుకంటే ఇందులో మెజార్టీ ప్రాజెక్టులు లిటిగేషన్లో ఉండటమో లేదా.. ఎన్పీఏ ఆస్తులుగా మారాయని వివరించారు. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వివరాల ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 4.5 లక్షల కోట్ల విలువైన 5.6లక్షల ఇండ్లు నిలిచిపోయాయి. దేశంలోని ప్రాపర్టీ మార్కెట్లో మందగమనానికి ఈ ప్రాజెక్టుల నిలిచివేత మూలకేంద్రంగా ఉండటం గమనార్హం.