Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూడిల్లీ: నూతన 'మోటారు వాహన చట్టం' నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. కొత్త చట్టంలో జరిమానాలు భారీగా విధించటంతో పాటు జైలు శిక్ష ఉండటమే ఇందుకు కారణం. దీంతో వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. బీమా కంపెనీలకు పరుగులు పెడుతున్నారు.
వాహన పత్రాలంటే సాధారణంగానే రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుకొస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే చాలావరకు షోరూం నిర్వాహకులే రిజిస్ట్రేషన్తోపాటు ఇన్సూరెన్స్ చేయించడం సర్వసాధారణమైంది. అయితే రెన్యూవల్ చేసుకోవడంలో వాహనదారులు వెనుకడుగేస్తున్నారు. ఇన్సూరెన్స్ చేయించని వాహనాన్ని నడిపితే సెక్షన్ 196 ప్రకారం గతంలో రూ.1,000 జరిమానా విధించేవారు. కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా రెట్టింపు అయింది. దీనికి తోడు మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రెండో సారి ఇదే నేరం చేస్తే జరిమానా నాలుగురెట్లు పెరుగుతుంది. మన దేశంలో దాదాపు 45 శాతం వాహనాలకు చెల్లుబాటయ్యే మోటారు బీమా లేదనీ పలు సర్వేల్లో వెల్లడైంది. మోటారు వాహనాల పాలసీల పునరుద్ధరణలో ప్రస్తుతం పెరుగుదల భారీగా ఉన్నప్పటికీ, ఇది స్వల్ప కాలికమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలను తగ్గించటం, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడం వంటి కారణాలను వారు గుర్తుచేశారు. భారీ జరిమానాలకు బదులు, వాహన బీమాపై అవగాహనను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.