Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆటో'రంగంలో పుంజుకోని కొనుగోళ్లు
- జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం నాన్చుడు ధోరణి
- వాయిదా వేసుకుంటున్న కొనుగోలుదారులు
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ రంగంలో ఆగస్టులో కనిపించిన మందగమనమే సెప్టెంబర్(ఈ నెల)లోనూ కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు మోడీ సర్కారు అనుసరిస్తున్న నాన్చుడు ధోరణే ఒక కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 'ఆటో' రంగంలో కొనుగోళ్లను పెంచేందుకు మోడీ సర్కారు.. జీఎస్టీ తగ్గింపు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. కానీ, ఈ తగ్గింపు అమలుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కాస్తోకూస్తో జరుగుతున్న ఆటో రంగంలోని విక్రయాలపైనా కేంద్రం తీరు ప్రభావం చూపిస్తున్నదని ఆటోరంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలుదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, ఈ నెల 13న మొదలైన 'శ్రాద్ద' కాల వ్యవధి(15 రోజులు)లోనూ అమ్మకాలు సాధారణంగా స్వల్పంగా ఉంటాయి. హిందూ మతస్తులు ఈ కాలంలో తమ పూర్వీకులకు విధేయతతో సంప్రదాయబద్ధ కార్యాలను నిర్వహిస్తారు. ఈ కాలవ్యవధిలో బంగారం మొదలు కార్లు, ప్రాపర్టీ వరకు ఆస్తుల కొనుగోళ్లు కలిసిరావని భావిస్తారు. ఈ నెల 28నాటికి శ్రాద్ధ కాల వ్యవధి ముగుస్తుంది. అంటే, దాదాపుగా నెల ముగిసిపోతుంది. మోడీ సర్కారు ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ఇంకా అమల్లోకి రానేలేదు. శ్రాద్ధ పీరియడ్ ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు తరహాలోనే సెప్టెంబర్లోనూ ఆటోమొబైల్ రంగంలో కొనుగోళ్లు రికార్డుస్థాయిలో కుచించుకుపోతాయని నిపుణులు అంచనా కడుతున్నారు.
గతనెలలో ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు అత్యంత వేగంగా 23.55శాతం(గతేడాదితో పోల్చితే) దిగజారిన విషయం తెలిసిందే. కొనుగోలుదారుల డిమాండ్ క్షీణించడంతో రిటేల్ అమ్మకాలు వెనుకపట్టుపట్టాయి. దీంతో డీలర్ల దగ్గర ఇన్వెంటరీలు నిండిపోయాయి. అమ్మకాలు పడిపోవడంతో దిగ్గజ కంపెనీలూ కొన్ని రోజులు కొన్ని ప్లాంట్లలో పనిని నిలిపేశాయి. అంతేకాదు, వేల సంఖ్యలో ఉద్యోగులను, శ్రామికులను తొలగించాయి. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాల్లో మందగమనం దాని అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం వేసింది. ఈ రంగాల్లో లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. గతనెలలో ఆటోరంగంతోపాటు ఇతర రంగాల్లోనూ విక్రయాలు పడిపోయి వేలాది కొలువుల్లో కోత పడింది. ఆర్థిక మందగమనం ఆగస్టులోనే స్పష్టమైంది. ఈ మందగమనాన్ని అంగీకరించని మోడీ సర్కారు.. కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించింది.
జీఎస్టీని 28 నుంచి 18శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్రంగం యాజమాన్యాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్పై కేంద్రం స్పందించింది. అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకునేందుకు జీఎస్టీ తగ్గింపు అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతనెలలో హామీనిచ్చారు.
తగ్గింపు ఉన్నదా లేదా? స్పష్టతనివ్వాలి
ప్రస్తుతం నెలకొని ఉన్న మందగమనాన్ని ఎదుర్కొనడానికి జీఎస్టీ తగ్గింపు కీలకమని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ బుషెక్ తెలిపారు. అయితే, ఆ తగ్గింపు ఉన్నదా లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేయాలన్నారు. జీఎస్టీ తగ్గింపు సాధ్యమైతే తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అస్పష్టతవల్లే కొనుగోలుదారులు స్లాట్లను రద్దు చేసుకుంటున్నారనీ, జీఎస్టీ తగ్గింపు కోసం డీల్ను వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు. షోరూమ్లలో కస్టమర్ల తాకిడి పెరిగిందనీ, కానీ, వారు జీఎస్టీ తగ్గింపునకు సంబంధించే ఎక్కువ వాకబు చేస్తున్నారని ఓ టాటా మోటార్స్ డీలర్ చెప్పారు. దీంతో వారు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నట్టు అర్థమవుతుందన్నారు.