Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త. 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు.. 8.65 శాతం వడ్డీని చెల్లించనున్నట్టుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. తాజా నిర్ణయంలో ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలుగుతుందని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అధిక వడ్డీ చెల్లింపునకు ఆర్థిక శాఖ నుంచి సమ్మతి లభించినట్టుగా తెలిపారు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిపిన చర్చల్లో.. 8.65 శాతం వడ్డీ రేటు చెల్లింపునకు ఇరుపక్షాల అంగీకారం లభించిందన్నారు. అధిక వడ్డీ చెల్లించినా సంస్థ వద్ద ఇంకా సరిపడా మిగులు ఉందని వివరించిన అనంతరం పెంపుదలకు ఆర్థిక శాఖ నుంచి మార్గం సుగమమైనట్టుగా ఒక అధికారి తెలిపారు. తాజా నిర్ణయంతో 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉండనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి. పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్ చందాదారులకు సవరించిన 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.