Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు
- ప్రభావం చూపిన సౌదీ పరిణామాలు..
- 642 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- 10818కి చేరిన ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ
ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనమయ్యాయి. సౌదీలో యుద్ధమేఘాలు కమ్ముకుంటుండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడం, డాలరుతో పోలిస్తే రుపాయి విలువ మరింతగా పడిపోవడం, దేశీయ సూక్ష్మ గణాంకాల్లో అనిశ్చితి తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బెంచ్మార్క్ సూచీలు ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా నష్టపోయినట్టయింది. ప్రధానంగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి పడిపోవడం, క్రూడ్ ధరలు భగ్గుమనడం, జీడీపీ వృద్ధి పడిపోవడం, ఆటో రంగంలో డీలా పరిస్థితి వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ౖ మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 642 పాయింట్లు దిగజారి 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 704 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 10,796 స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటి పతనంతో నిఫ్టీ 2019లో నెగటివ్లోకి జారుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.86 దరిదాపుల్లో కొనసాగింది. ఆటో, బ్యాంకింగ్, లోహ, మౌలిక, ఐటీ, ఫార్మా ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే వూగిసలాడాయి. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు 3 శాతానికి పైగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ 50లో గెయిల్, టైటాన్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ దాదాపు 2 శాతం పెరిగింది. అదే సమయంలో హీరో మోటొకార్ప్, టాటా మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. హీరో మోటొకార్ప్ ఏకంగా 6 శాతం పతనమైంది.
మార్కెట్ల పతనానికి కారణాలివే..
- సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు క్షేత్రాలపై యెమెన్ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులు చేయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. మరోవైపు డ్రోన్ దాడి నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రానున్న రోజుల్లో చమురు ధరలు భారీగా పెరిగి భారత్ వాణిజ్య లోటు పెరగొచ్చనే ఆందోళనలు దావానంలా వ్యాపించాయి. ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
- చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటంతో దేశీయ కరెన్సీ రూపాయి అంతకంతకూ క్షీణిస్తూ వస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో స్టాక్ మార్కెట్ నుంచి ఇప్పటి దాకా రూ.2,428 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించు కున్నారు. ఇది కూడా మార్కెట్ ప్రతికూల ప్రభావం చూపింది.
- మరోవైపు ఆటోరంగంపై జీఎస్టీ తగ్గింపు ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ ప్రభావంతో ఆటోమొబైల్ దిగ్గజ షేర్లు నేలచూపులు చూశాయి.
- అమెరికా పెద్ద బ్యాంక్ ఫెడ్ బుధవారం తన పరపతి విధాన సమీక్షను ప్రకటించనుంది. ఫెడ్ ప్రకటించే వృద్ధిరేటు అంచనాలు, వడ్డీరేటు నిర్ణయంపై మదుపర్లలో ఆందోళన నెలకొంది. దీంతో మదుపరులు తాజా అమ్మకాలకు ఎగబడ్డారు.