Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈపీఎఫ్వో, ఈఎస్ఐలపై సర్కారు కన్ను
- ధర్మకర్తల మండలిని డమ్మీ చేసే యత్నం
- సీఈవోలు, డైరెక్టర్ల నియామకానికి ప్లాన్
- తగ్గిపోనున్న లేబర్ అధికారుల పర్యవేక్షణ
- ఉద్యోగుల భద్రతకు ముప్పు!
- పనితీరును మార్చేలా కొత్త 'ముసాయిదా'
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా సంస్థలుగా సేవలందిస్తున్న 'ఉద్యోగ భవిష్య నిధి సంస్థ' (ఈపీఎఫ్వో), 'ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ'లను (ఈఎస్ఐసీ) పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కారు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖ పర్యవేక్షణలో ట్రస్టీలు, బోర్డుల ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థలుగా పని చేస్తున్నాయి. అయితే వీటిని సర్కారు పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనే విధంగా కొత్త ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. కార్మిక, ఉపాధి కల్పనా శాఖ జారీ తాజాగా విడుదల చేసిన 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2019 ముసాయిదా ప్రకారం ఈ రెండు సంస్థలను సర్కారు కార్పొరేట్ సంస్థలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టుగా తెలిపింది. ఈ క్రమంలో భాగంగా ఈ రెండు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇతర కార్పొరేట్ సంస్థల మాదిరిగా చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించనుంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్వో, ఈఎస్ఐసీల రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదనను కూడా సర్కారు ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. సీఈవోలతో పాటు ఈ రెండు సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు గాను కొత్తగా డైరెక్టర్లు, ఇతర కార్యనిర్వాహణ సిబ్బందిని కూడా ఆయా సంస్థల్లో సర్కారు జొప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థల్లో ధర్మకర్తల మండలి, బోర్డులు ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం కలిగేలా కృషి చేస్తూ వస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు గాను ధర్మకర్తల మండలి, బోర్డులు సర్కారుపై తీవ్ర ఒత్తిడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల్లో ధర్మకర్తల మండలి, బోర్డుల అధికారాలను పరిమితం చేయడంతో పాటు ఈ సంస్థల నిర్ణయాలు, కార్యకలాపాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే క్రమంలోనే సర్కారు ఈ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చినట్టుగా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఈపీఎఫ్వో వడ్డీరేట్ల పెంపు విషయంలో సర్కారుకు ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డుకు మధ్యం తీవ్ర పరోక్ష యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఎక్కువ పీఎఫ్ వడ్డీరేటు చెల్లించడం ఇష్టం లేని సర్కారు ఆర్థికశాఖ ద్వారా పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే వాటికి ఈపీఎఫ్వో ధర్మకర్తల మండలి సమర్థంగా సమాధానం ఇవ్వడంతో పాటు మెరుగైన వడ్డీరేటు చెల్లింపునకు పట్టు పట్టడంతో సర్కారు దిగిరాక తప్పలేదు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి పూర్తిగా చెక్పెట్టాలని భావిస్తున్న సర్కారు భారీగా చందా నిధులు కలిగి ఉన్న ఈ రెండు సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోనేందుకే తాజా ప్లాన్ను ముసాయిదాలో పొందుపరిచినట్టుగా సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పక్కాగా ప్లాన్ చేశారా..!
ఈపీఎఫ్వో, ఈఎస్ఐసీ సంస్థలు ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. ఈ రెండు సంస్థలు కార్మిక శాఖ నేతృత్వంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగ సంక్షేమం నిమిత్తం వీటిలో కీలక నిర్ణయాల అధికారం ధర్మకర్తల మండలికి, బోర్డుకు కల్పిస్తూ పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్కు, ఈఎస్ఐసీకి బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మెన్గా వ్యవహరిస్తున్నారు. కార్మిక శాఖ సహాయ మంత్రి గైర్హాజరు సమయంలో వీటికి చాలా సార్లు కార్మిక శాఖ కార్యదర్శి వైస్చైర్మెన్గా వ్యవహరిస్తుంటారు. తాజా ముసాయిదా ప్రకారం ఇకపై రానున్న రోజుల్లో ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్కు, ఈఎస్ఐసీకి బోర్డుకు ప్రభు త్వం ప్రత్యేకంగా చైర్మెన్లను, వైస్ చైర్మెన్లను నియ మించనుంది. వీరు కార్మిక శాఖతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కార్మిక శాఖ కార్యదర్శికి వీటిలో స్థానమే లేకుండా పోనుంది. దీనికి తోడు ఈ రెండు సంస్థలను ప్రస్తుతం సెంట్రల్ ప్రావి డెంట్ కమిషనర్, డైరెక్టర్ జనర ల్లు నిర్వహిస్తున్నారు. వీటి స్థానంలో సర్కారు కొ త్తగా ఐఏఎస్ అధికారులను లేదా ఆలిండియా సర్వీసెస్ అధికారులను ఈ రెం డు సంస్థ లకు సీఈవోలుగా నియమించనుంది. దీంతో ఈ రెండు సంస్థల నిర్వహణ, నిర్ణయాలు ఉద్యోగుల సాధకబాధకాలు ప్రత్యక్షంగా తెలియని అధికారుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ఈ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాలు, పబ్లిక్ కమిటీలు తమ అభిప్రాయాన్ని వచ్చే నెల 25లోపు తెలియజేయాలని సర్కారు కోరింది.