Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధిని పెంచేందుకు సర్కారు సరికొత్త ఆలోచన
- ఎన్బీఎఫ్సీ సంస్థ సౌజన్యంతో ప్రజలకు రుణాలు
- 400 జిల్లాల్లో టెంట్లు వేసి మరీ అప్పుల జారీ..!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో నగదు అందుబాటును పెంచేందుకు గాను కేంద్రం సర్కారు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. మందగమనం కారణం కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచి.. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు గాను రానున్న రోజుల్లో బ్యాంకుల ద్వారా దేశ వ్యాప్తంగా భారీగా రుణ మేశాలను నిర్వహింపజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్వయంగా విలేకరులకు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నగదు అవసరం ఉన్న రిటైల్ వినియోగదారులకు విరివిగా రుణాలను అందించే ఉద్దేశంతో ఈ భారీ రుణమేళాలకు శ్రీకారం చుడుతున్నట్టుగా ఆమె తెలిపారు. వచ్చే వారం నుంచి మొదలుకొని దేశంలోని దాదాపు 400 జిల్లాల్లో ఈ కార్యక్రమాల్ని భారీగా చేపట్టనున్నట్టుగా సీతారామన్ తెలిపారు. ఈ రుణమేళాల్లో రైతులకు, ఔత్సాహిక గృహ కొనుగోలుదారులతో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల వారికి కూడా రిటైల్ రుణాలను అందించనున్నట్టుగా ఆమె తెలిపారు. దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఇందుకు గాను ఆయా బ్యాంకులు తమకు అందుబాటులో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సౌజన్యంతో వీటిని నిర్వహించనున్నాయని మంత్రి తెలిపారు. బ్యాంకులు ఈ ఓపెన్ హౌస్ పబ్లిక్ మీటింగ్లను (రుణ మేళాలు) రెండు దఫాలుగా నిర్వహిస్తాయని సీతారామన్ తెలిపారు. వచ్చేనెల (అక్టోబరు) 3 నుంచి 7 వరకు 200 జిల్లాల్లోనూ, అక్టోబరు 11 నుంచి మిగతా జిల్లాల్లో రుణ మేళాలు జరగనున్నట్టుగా మంత్రి తెలిపారు. పండుగల సీజన్లో ప్రజలకు గరిష్టంగా రుణాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ రుణమేళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) స్ట్రెస్డ్ అసెట్స్ను వచ్చే ఏడాది మార్చి ముగింపు వరకు బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) ప్రకటించవని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు ఒక సర్క్యూలర్ను కూడా జారీ చేసిందని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. ఎన్పీఏల ప్రకటన కంటే కూడా రానున్న రోజుల్లో ఎంఎస్ఎంఈ సంస్థల రుణాలను వన్-టైమ్ సెటిల్మెంట్ చేసే దిశగా బ్యాంకులు చర్యలు చేపట్టనున్నాట్టుగా మంత్రి తెలిపారు.