Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల దీపావళి పండగ ముందే వచ్చేసినట్లుంది. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో వూరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలతో దేశీయ మార్కెట్లలో లాభాల మోత మోగింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాలను నమో దు చేశాయి. ప్రభుత్వ పన్ను వూరడింపుతో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా సూచీలు లాభాల రేస్లో దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్ల పైన లాభపడింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్ దాటింది. శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారం భమైన దేశీయ మార్కెట్లు కేంద్ర ప్రభుత్వ అనూహ్య పన్ను తగ్గింపుల ప్రకటనతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, స్టాక్ మార్కెట్ మూలధన ఆదాయాలపై సర్చార్జీలను తగ్గిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించడం సూచీలకు ఊతం ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే మార్కెట్లు భారీ లాభాల దిశగా ఉరకలేశాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా ఎగబాకింది. అటు నిఫ్టీ 600 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైనే పెరిగింది. గురువారం నాటి ముగింపు ప్రకారం.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ మార్కెట్ విలువ రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. అయితే దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 143.45లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైన పెరిగిదన్నట్టు. ఆ తరువాత మార్కెట్లు రోజంతా భారీ లాభాల్లోనే కొసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1924 పాయింట్ల లాభంతో 38,015 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 569 పాయింట్లు లాభపడి 11,274 వద్ద ముగిసింది. శుక్రవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.6.82 లక్షల కోట్ల పెరిగింది. గత పదేళ్లలో సూచీలు ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. మరోవైపు డాలరతో పోలిస్తే రూపాయి కూడా పుంజుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.05 దరిదాపుల్లో కొనసాగింది.