Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక నిర్ణయాల్లేకుండానే ముగిసిన మీట్
పనాజీ (గోవా): దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా వివిధ రంగాలలో నెలకొన్న స్తబ్దతను దూరం చేసే దిశగా శుక్రవారం సమావేశమైన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలిఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పూర్తి చప్పగా ముగిసింది. ఈ సమావేశంలో కేఫినేటెడ్ బేవరేజస్పై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హోటల్ గదులపై జీఎస్టీని కొంత తగ్గించారు. మండలి సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ వివిధ వస్తువుల పన్ను రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించామన్నారు. పన్ను రేట్లపై సలహాలు, సూచనలను స్వీకరించినట్టుగా తెలిపారు. కేఫినేటెడ్ బేవరేజస్పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచుతున్నట్టుగా ప్రకటించారు. దీనికి 12 శాతం సెస్ను అదనంగా జోడించారు. ఇక హోటల్ గదుల విషయంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రాత్రికి వెయ్యి రూపాయలు లోపు ఉన్న అద్దె గదులకు జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. రూ.1001 నుంచి 7,500 ఉండే గదులకు జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. రూ.7,500 పై బడి ఉన్న గదులకు జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఔట్ డోర్ కేటరింగ్పై విధించే 18 శాతం పన్ను రేటును 5 శాతానికి తగ్గించారు. మెరైన్ ఫ్యూయెల్పై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. చింతపండుపై ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. వెట్ గ్రైండర్స్పై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. మరోవైపు దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు మినహాయింపు కల్పించినట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఫిఫాకు అందించే వస్తువులు, సేవలపై భారత్లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల టోర్నీ వరకు మినహాయింపు కల్పించినట్లు పేర్కొన్నారు. సవరించిన పన్నురేట్లు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.