Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపన్నుల పన్ను భారాల్ని తగ్గించిన సర్కారు
- కార్పొరేట్ పన్ను దాదాపు 10% మేర తగ్గింపు..
- మార్కెట్ మూలధన లాభాలపైనా సర్చార్జ్ కట్
- ఎఫ్పీఐలకు ఊతమిచ్చేలా పన్నుల తగ్గింపులు..
- సూపర్రిచ్ పన్ను, 'మ్యాట్'లకు తాజా సవరణలు
- ఉత్సాహంగా పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు..
- ఖజానాకు దాదాపు రూ.1.47 లక్షల కోట్ల నష్టం
- సర్కారు ద్రవ్యలోటు భారీగాపెరిగిపోయే ప్రమాదం
పనాజీ: ఆర్థిక వ్యవస్థ మందగమనంతో కునారిల్లుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాన్ని నిలబెట్టేందుకు కార్పొరేట్ సంస్థలకు మరోమారు దాసోహమంది. శ్రీమంతులు వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థను రూపొందిచేందుకు గాను పలు కీలక పన్ను రేట్లను సర్కారు తగ్గించింది. ఈ దిశగా సర్కారు శుక్రవారం పలు కీలక ప్రకటనలు చేసింది. మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టుగా పునరుద్ఘాటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఈ దిశగా శుక్రవారం పలు నిర్ణయాలను ప్రకటించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును (సర్చార్జ్, సెస్ కలిపి) 34.94 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను చేర్చుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో మెరుగ్గా పెట్టుబడులను ఆహ్వానించేందుకు, వృద్ధిరేటు పెంచేందుకే కార్పొరేట్ పన్నులను తగ్గించాలని నిర్ణయించినట్టుగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మంత్రి ప్రకటనతో ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను భారీగా దిగి రానుంది. సర్ఛార్జ్, సెస్ అన్నీ కలిపి ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్ 34.94శాతంగా ఉంది. కొత్త నిబంధనలతో దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను 22శాతానికి తగ్గనుంది. సర్ఛార్జ్లు, సెస్ కలిపి మదిస్తే ఇది 25.17శాతానికి చేరనుంది. అయితే ఇందుకు సర్కారు ఒక షరతు కూడా విధించింది 22 శాతం రేటుతో కార్పొరేట్ పన్ను కడితే ఆ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలుగానీ.. రాయితీలు గానీ అందవని సర్కారు తెలిపింది. అక్టోబరు 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ రంగ సంస్థలు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు తీసుకోకుండా 15శాతం ఆదాయపు పన్ను చెల్లించొచ్చని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో కొత్త సంస్థలకు కార్పొరేట్ పన్ను భారం (సర్చార్జ్, సెస్ కలిపి) 17.01శాతానికి తగ్గనుంది. ఈ కంపెనీలకు ఇప్పటివరకు కార్పొరేట్ పన్ను 25 శాతంగా ఉండగా.. సర్ఛార్జ్, సెస్ కలిపి 29.12శాతంగా ఉండేది. ఈ ఆదాయపుపన్ను శ్లాబులో ఉన్న కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కూడా చెల్లించాల్సిన అవసరం లేదని సీతారామన్ ప్రకటించారు. ప్రోత్సాహకాలు, రాయితీలు అందుకోవాలంటే కంపెనీలు పాత పన్ను విధానంలోనే కార్పొరేటు పన్నులు చెల్లించుకోవచ్చు. అయితే పాత పన్నుల విధానంలో చెల్లించే కంపెనీలకు కనీస పత్యామ్నాయ పన్నులో కొంత ఊరట లభించింది. కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5శాతం నుంచి 15శాతానికి తగ్గించారు. విదేశీ సంస్థాగత మదుపరులు కంపెనీల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన మూలధన లాభాల పై ఇకపై ఎలాంటి అదనపు సర్ఛార్జ్ ఉండదు. కార్పొరేట్ ట్యాక్స్ను గణనీయంగా తగ్గించడంతో పాటు షేర్ల విక్రయం, మ్యూచ్వల్ ఫండ్స్లో యూనిట్ల అమ్మకం ద్వారా సమకూరే మూలధన లాభాలపై అదనంగా విధించిన సర్చార్జ్ నుంచి వ్యక్తులు (సంపన్నులు), హిందూ అవిభక్త కుటుంబాలను మినహాయిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాపిటల్ మార్కెట్లోకి నిధుల ప్రవాహాన్ని స్ధిరీకరించేందుకు ఇటీవల ఫైనాన్స్ చట్టం ద్వారా షేర్ల విక్రయంపై పొందే క్యాపిటల్ గెయిన్స్పై అదనంగా విధించిన సర్చార్జ్ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబానికి (హెచ్యూఎఫ్) వర్తించవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. జులై 5, 2019 కంటే ముందే షేర్ల బైబ్యాక్ ప్రకటించిన లిస్టెడ్ కంపెనీలకు ఎలాంటి సూపర్ రిచ్ పన్ను కూడా ఉండదని సర్కారు తెలిపింది. అయితే సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో రానున్న రోజుల్లో సర్కారు ద్రవ్యలోటు భారీగా పెరగిపోయే అవకాశం ఉందని రేటింగ్ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పేదలకంటే.. పెద్దలకే ఎక్కువ లాభం..
ప్రయివేటు రంగానికి అండగా ఉంటూ ప్రోత్సహిస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. 2015-16 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కార్పొరేట్ పన్నులపై అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ కొన్ని హామీలిచ్చారు. రానున్న నాలుగేళ్లలో అంటే 2019 నాటికి కార్పొరేట్ పన్నును 25శాతానికి తీసుకొస్తామని నాడు జైట్లీ అన్నారు. అయితే అది దశలవారీగా జరుగుతుందన్నారు అన్నట్టుగానే కార్పొరేట్ పన్నుకు భారీగా తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర ఉద్దీపనలతో ప్రభుత్వ ఖాజానాకు దాదాపు ఏటా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. అంటే ఈ మేరకు కార్పొరేట్ సంస్థలకు మేలు జరగనుంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థుతుల నేపథ్యంలో సర్కారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుం టూ మరింత ఇబ్బందుల్లోకి కూరుకుపోతోందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కెందుకు గాను సర్కారు వ్యవస్థలో డిమాండ్ పెంచే దిశగా చర్యలు చేపట్టాల్సింది పోయి.. ఉత్పత్తి పెంపు వైపే ఎక్కువగా దృష్టి సారించడాన్ని వారి తప్పుబడుతున్నారు. వ్యవస్థలో ఇప్పటికే డిమాండ్ లేక అనేక రంగాల్లో ఉత్పత్తి తగ్గించుకునే పరిస్థితి నెలకొం దని.. ప్రభుత్వం ఈ విషయాన్ని మరచి.. మరిన్ని పెట్టుబడులు తెచ్చే పేరుతో పెద్దలక మేలు చేసేందుకే శుక్రవారం పలు కీలక పన్ను రేట్లను తగ్గించిందన్న విమర్శలు వినవస్తున్నాయి. సర్కారు చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థకు, దేశంలోని ప్రజలకు కలిగే లాభం స్వల్పమేనని.. ఎక్కువగా బడా బాబులకు, కార్పొరేట్ సంస్థలకే మేలు జరగుతుందని వారు విశ్లేషిస్తున్నారు.