Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కల్పనపై కొరవడిన దృష్టి..
- భావోద్వేగంతో ప్రజలను మభ్య పెట్టొద్దు :ప్రముఖ ఆర్థికవేత్త హెచ్.ఎమ్ దేసార్ధా
ముంబయి: ఐదేండ్ల కిందట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం లభించినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో మోడీ సర్కారు విఫలమయిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక బోర్డు మాజీ సభ్యులు హెచ్.ఎమ్ దేసార్ధా అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఆదాయ, వ్యయాల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదంలోపడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని 'మహాత్మా గాంధీ మిషన్ క్యాంపస్'లో 'ప్రస్తుత ఆర్థిక పతనానికి కారణాలు-పరిష్కారాలు' అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ... 'జీడిపీ వృద్ధి ఈ ఏడాది ఐదో త్రైమాసికంలో 5 శాతానికి చేరింది. ఇది గడిచిన ఆరేండ్లలో కనిష్ట స్థాయి. అంతార్జాతీయంగా ముడి చమురు తక్కువగా ఉన్న కాలంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. పెట్రోల్, డీజిల్ డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ముడి చమురు దిగుమతి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసిందని' అన్నారు. అలాగే రోడ్ల నిర్మాణానికి భారీ స్థాయిలో ఖర్చు చేయడం మూలంగా 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' 3 లక్షల కోట్ల రుణ భారం పడుతుందని, దానిపై వడ్డీగా రూ.25 వేల కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. టోల్ టాక్స్ నుంచి వచ్చే మొత్తం రూ.7 వేల కోట్లకు మించదని ఆయన గుర్తించినట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఇలాంటి పలు అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని వివరించారు. 'పెరుగుతున్న జనాభా నేపథ్యంలో జీవనోపాధిపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఎన్నికల్లో గెలవడంపైనే ముందుచూపును ప్రదర్శించింది. అలాగే ప్రజల్లో భావోద్వేగాలను పెంచుతూ ముందుకు సాగింది. దీని వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదర్కోవాల్సి ఉంటుందనీ, ఇది ఎక్కువ కాలం నిలవదని' అన్నారు. ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, ఎగుమతులను పెంచకుండా, కార్పోరేట్లకు పన్నులు తగ్గించటం మూలానా జీడీపీ మందగమనం తొలగదని' చెప్పారు.