Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 12వ సారీ టాప్
- రూ.3.85 లక్షల కోట్లకు చేరువైన నికర ఆస్తులు
- 15.7 బి.డా. సంపదతో రెండో స్థానంలో అదానీ
న్యూఢిల్లీ: భారత్లో అపర కుబేరుడిగా పేరున్న రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ.. దేశంలోని సంపన్నుల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 'భారత సంపన్నుల జాబితా'లో 51.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.85 లక్షల కోట్ల) విలువైన నికర ఆస్తులతో అంబానీ వరుసగా 12వ సారి భారత సంపన్నుల లిస్ట్లో టాప్ ప్లేస్ను దక్కించుకున్నారు. ఆర్ఐఎల్ గొడుగు కింద జియో సేవలు అందుబాటులోకి రావడంతో ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇది ఆయన సంపద పెరిగేందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది ఫోర్బ్స్ భారత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అజిమ్ ప్రేమ్జీ.. ఈ సారి 17వ స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది మార్చిలో అజిమ్ ప్రేమ్జీ తన సంపదలో చాలా వరకు స్వచ్ఛంద కార్యక్రమాల కోసం విరాళమిచ్చిన విషయం తెలిసిందే. అంబానీ, అదానీ తర్వాత అశోక్ లేల్యాండ్ యజమానులు హిందుజా బ్రదర్స్, పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదరు కోటక్లు సంపన్నుల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఉదరు కొటక్ టాప్ 5లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ జాబితాలో టాప్ 10 స్ధానాల్లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్నాడార్, అవెన్యూ సూపర్మార్ట్స్ అధినేత దమాని, గోద్రెజ్ కుటుంబం, పారిశ్రామిక దిగ్గజాలు కుమార మంగళం, బిర్లా ఫ్యామిలీలు నిలిచాయి. ఈ సారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆరుగురు కొత్తవారికి చోటు దక్కింది. ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూ అధినేత బైజూ రవీంద్రన్ తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 1.91 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 72వ స్థానంలో నిలిచారు.
ముగ్గురు తెలుగువారికి చోటు..
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ముగ్గురు తెలుగువారికి చోటు దక్కింది. మెఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత పి.పి. రెడ్డి (3.38 బిలియన్ డాలర్లు), అరబిందో ఫార్మా అధినేత పి.వి.రాంప్రసాద్ రెడ్డి (2.25), డాక్టర్ రెడ్డిస్కు చెందిన రెడ్డీ కుటుంబీకులు (1.76) ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.