Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో మందగమన పరిస్థితుల ప్రభావం పారిశ్రామిక రంగంపై బలంగా కనిపిస్తోంది. దేశంలో వినియోగదారుల సెంటిమెంట్ దిగజారుతూ డిమాండ్ తగ్గుతుండడంతో దేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతూ వస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం సర్కారు వెల్లడించిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు స్పష్టంగా నిరూపించి చూపాయి. గత ఆగస్టు మాసంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి 1.1 శాతం మేర పడిపోయింది. ఇది దాదాపు 81 నెలల కనిష్టానికి సమానమని రేటింగ్ సంస్థలు విశ్లేషించి చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఐఐపీ సూచీల 4.8 శాతం పెరిగింది. ఆగస్టు మాసంలో ఐఐపీ పడిపోయి 81 నెలల కనిష్టానికి చేరడం ఆందోళనకర విషయమేనని వారంటున్నారు. తయారీ, విద్యుత్తు ఉత్పత్తి, మైనింగ్ సహా పలు రంగాల్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో ఆగస్ట్లో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతం తగ్గిందని సర్కారు తాజా గణాంకాలలో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో విద్యుత్తు ఉత్పత్తి 7.6 శాతం పెరగ్గా.. తాజాగా ఇది 0.9 శాతం పడిపోయింది. మైనింగ్ రంగం కేవలం 0.1 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇక ఐఐపీలో 77 శాతం వాటా ఉండే తయారీ రంగం ఈ ఏడాది ఆగస్ట్లో 1.2 శాతం మేర కుదేలైంది. ఈ కీలక రంగం గత ఏడాది ఆగస్టు నెలలో 5.2 శాతం వృద్ధిని కనబరచడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు గత ఏడాది ఆగస్ట్లో 5.3 శాతం నుంచి ఈ ఏడాది ఆగస్ట్లో 2.4 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఐపీ వృద్ధి గణాంకాలను సోమవారం వెల్లడించనున్నట్టు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కోలుకోని ఆటో అమ్మకాలు..
సంక్షోభంలో కూరుకుపోయిన వాహన రంగం ఇప్పట్లో గట్టెక్కేలా కన్పించట్లేదు. వరుసగా 11వ నెల కూడా ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించాయి. సెప్టెంబరు నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 23.69 శాతం తగ్గాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్(సియామ్) వెల్లడించిన గణాంకాల మేరకు గత నెలలో కేవలం 2,23,317 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018 సెప్టెంబరులో 2,92,660 యూనిట్ల ప్రయాణ వాహనాలను విక్రయించారు. దేశీయ కార్ల అమ్మకాలలో 33.4శాతం క్షీణత నమోదైంది. వీటి అమ్మకాలు గత నెలలో ఇది 1,31,281 యూనిట్లకు పరిమితమైంది. ఇక మోటార్సైకిల్ విక్రయాలు 23.29 శాతం తగ్గి 10,43,624 యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తంగా ద్విచక్రవాహనాల అమ్మకాలు 22.09శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 39.06శాతం తగ్గాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా సెప్టెంబరులో 20,04,932 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 సెప్టెంబరులో విక్రయమైన 25,84,062 యూనిట్ల వాహనాలతో పోలిస్తే ఇది 22.41శాతం తక్కువ అని సియామ్ పేర్కొంది.