Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో మోడీ సర్కారు అనాలోచితంగా తొందరపడుతూ అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో లోపాలు ఉన్నాయన్న విషయాన్ని సర్కారు ఎట్టకేలకు అధికారింకంగా అంగీకరించింది. జీఎస్టీ పన్ను ఆదాయం అంతకంతకు పడిపోతున్న వేళ స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని అంగీకరించడం విశేషం. జీఎస్టీ విధానంలో లోపాలు ఉండవచ్చని అన్నారు. అంత మాత్రాన విధానాన్నే దూషించడం సరికాదన్నారు. దేశంలో చట్టం చేసేసినందున విధానంలోని లోపాలను సరిదిద్దేందుకు ఆర్థిక నిపుణులు సలహాలు ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. జీఎస్టీ విషయమై పరిశ్రమ వర్గాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కొంత మంది జీఎస్టీ విధానాన్ని విమర్శిస్తూ సీతారామన్కు పలు ప్రశ్నలు సంధించారు. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో బిల్లు ఆమోదం పొందిన జీఎస్టీ విధానాన్ని తప్పుబట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పూర్తిగా వ్యతిరేకించడం తగదన్నారు. మెరుగైన విధాన రూపకల్పనకు సలహాలు, సూచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొంత మంది నిపుణులు ఇచ్చిన సలహాలను స్వీకరించారు. ఆర్థిక శాఖతో సమగ్రంగా చర్చించేందుకు నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని కోరారు. అంతకుముందు జీఎస్టీ వసూళ్ల క్షీణతపై స్పందిస్తూ.. కొన్ని ప్రాంతాల్లో విపత్తుల కారణంగా వసూళ్లు తగ్గాయని వివరించారు. అలాగే జీఎస్టీ వసూళ్ల తగ్గుదలకు గల కారణాలను కనుగొనడానికి ఇప్పటికే తాము కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సర్కారు విధానం చూస్తుంటే రానున్న రోజుల్లో ఆదాయం పెంచుకొనేందుకు గాను ఆయా వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.